మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత బాల్ ఠాక్రే. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్టవేసిన ఘనత ఆయనది. కానీ ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికలలో ఆయన పాల్గొనలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా పార్టీ సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషికి బాధ్యతలు అప్పగించి సైలెంట్ గా ఉన్నారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన ఉద్దవ్ ఠాక్రే కూడా తొలినాళ్ళలో చాలా సైలెంట్ గా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికలలో తొలిసారి ఆ కుటుంబం ఎన్నికలలో పాల్గొంది. ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత బీజేపీతో విభేదించిన ఉద్దవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఉద్దవ్ తడబాటు
తన సతీమణి రష్మీ ఠాక్రే సలహాతో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలన అంశంలో సరైన అవగాహన లేకపోవడంతో ఉద్దవ్ తన మార్క్ ఇప్పటివరకు చూపలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. కరోనా నియంత్రణ, వరదలు లాంటి అంశాలలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలతోనే ఇరుకున పడ్డ ఉద్దవ్ కు సుశాంత్ కేసు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. కంగనా ఆరోపణల నేపథ్యంలో సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ను కట్టడి చేయకపోవడంతో ఉద్దవ్ పై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది.
పవార్ సలహను వినండి మహాప్రభో
ఏకంగా కంగనా రనౌత్ ఇంటిని ముంబై అధికారులు పడగొట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్దవ్ చర్యలపై చర్చ జరిగింది. ఈ సమయంలోనే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా శివసేనకు ఓ సలహ కూడా ఇచ్చారు. సున్నితమైన అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని కురువృద్ధుడు పవార్ సలహాఇచ్చినా ఉద్దవ్ ప్రభుత్వం పాటించడంలేదు. అందుకు రుజువుగా ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామీ విషయం చెప్పాలి. సుశాంత్ కేసులో తమ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని కేసులు పెట్టారు. ఆ కేసు నుంచి ఆర్నబ్ బెయిల్ తెచ్చుకొని బయట పడ్డాడు. కానీ ఆయనను విడిచిపెట్టకుండా బార్క్ మీటర్లను ట్యాపింగ్ చేశారంటూ కేసులు నమోదు చేశారు.
ఢీ అంటే ఢీ
ఆర్నబ్ గోస్వామీ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న డిబేట్ చర్చలను రసవత్తరంగా మార్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అవతలి వారు మాట్లాడే అవకాశమివ్వడని విమర్శలు వచ్చినా బీజేపీకి మద్దతుగా నిలిచే ఛానల్ అంటూ ప్రచారం జరిగినా రిపబ్లిక్ ను దేశంలోనే నెంబర్ 1 ఛానల్ గా నిలిపారు. మిగిలిన జర్నలిస్టులు కూడా చర్చా వేదికలలో ఆర్నబ్ గోస్వామీని ఫాలో అయ్యేలా ఆయన బలమైన ముద్ర వేశారు. మరి అలాంటి ఆర్నబ్ తమపై కేసులు వేస్తే ఊరుకుంటారా? మహా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ప్రెస్ మీట్ పెట్టిన ముంబై కమీషనర్ ను ఉద్దేశించి ఏకంగా రా వచ్చి అరెస్ట్ చేసుకో అంటూ సవాలు చేశారు. వార్తలు ప్రసారం చేస్తాం… ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తున్న కేసుల విషయంలో విచారణ జరిపి తీరుతామంటూ ఆర్నబ్ హెచ్చరించారు. ఇంతకింతకు బదులు ఇస్తామంటూ ఆర్నబ్ గర్జించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయనే చర్చ జరుగుతోంది.











