ఏపీలో హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంట్లపల్లిలో టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త రంగనాయకులుకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ రంగనాయకులను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను విమర్శించిన వారిని హతమారుస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పెదగార్లపాడు మాజీ సర్పంచ్ హత్యోదంతం మరవక ముందే తాడిపత్రి మండలం ఎర్రగుంట్లపల్లిలో టీడీపీ కార్యకర్త హత్యకు తెగబడ్డారని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు దుయ్యబట్టారు.
పాలనంటే ధ్వంసాలు, హత్యలేనా?
ఏపీలో వైసీపీ పాలన దేవాలయాల ధ్వంసాలు, టీడీపీ నేతల హత్యలతో సాగుతోందని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంట్లపల్లిలో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.