ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది. ఎక్కడెక్కడ వెంచర్లు పడుతున్నాయి. వాటి ధర ఎంత, గజం ఎంత పలుకుతుంది, SFT ధర ఎంత చెబుతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది..ఇవే అంశాలపై అమరావతి చర్చ జరుగుతోంది. ఆదివారం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు,ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అమరావతికి క్యూ కట్టారు. అమరావతిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించారు. అమరావతిలో కొత్తగా జరుగుతున్న భూ సమీకరణ పరిస్థితులపైనా ఆరా తీశారు.
ఆదివారం ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి అమరావతికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన స్థిరాస్థి వ్యాపారులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన వారు అమరావతిలో కనిపించారు. వైసీపీ హయాంలో ఇలాంటి హడావుడి ఏనాడూ కనిపించలేదు. ఐతే కూటమి ప్రభుత్వం ఇటీవల అమరావతిలో నిర్మాణ పనులను పట్టాలెక్కించడంతో ప్రజలు అమరావతిపై ఆసక్తి చూపిస్తున్నారు.
రాజధాని పనులు ప్రారంభం కావడంతో పాటు..మరో ప్రధాన కారణం కూడా ఉందని తెలుస్తోంది. రాజధానిని మరింత విస్తరించడంతోపాటు.. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికితోడు.. గుంటూరు-తెనాలి-మంగళగిరి-విజయవాడలను కలుపుతూ.. కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై సర్కారు ఆలోచన చేస్తోంది. ఇదే జరిగితే..రాజధాని ప్రాంతం రేడియస్ పెరగనుంది. కృష్ణా నదిపై ప్రత్యేకంగా..ఈ నాలుగు ప్రాంతాలపరిధిలో రెండు ఐకానిక్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగనుంది.
రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వం వస్తుందన్న ధీమా కూడా దీనికి ఓ కారణం. ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా ప్రజలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయం తెలిసిన కొన్ని చానెళ్లు..ఇక్కడ కొందరిని కదిలించినప్పుడు.. భూములు కొనేందుకు వచ్చామనికొందరు చెప్పగా.. వెంచర్లు చూసేందుకు వచ్చామని కొందరు చెప్పారు. మొత్తంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు కూడా ప్రస్తుత పరిస్థితి చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.











