తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే మనం ఇవాళ ‘బాహుబలి’ గురించే మాట్లాడుతున్నాంగానీ అంతకుమించిన చిత్ర రాజాలు ఉన్న విషయాన్ని మనం మరచిపోతున్నాం.
ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కళఖండాలను రూపొందించిన ఘన చరిత్ర మన తారకరాముడి కాలం నుంచే ఉంది. అందులోని ఓ ఆణిముత్యం ‘లవకుశ’ గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవలసి ఉంది. అది తెలుసుకోవాలంటే అరవై ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే. 1963 మార్చి 29న ‘లవకుశ’ చిత్రం విడుదలైంది. ఇలాంటి సినిమా తీయడం మహాయజ్ఞం అని ఆనాడే రుజువైంది. ఈ సినిమా తెరవెనక కథ చెప్పాలి అంటే 1956లోకి వెళ్లాల్సిందే. అప్పుడు లలితా ఫిలింస్ ‘చరణదాసి’ అనే చిత్రాన్ని నిర్మించింది.
ఇందులో ఓ చిన్న సన్నివేశంలో ఎన్టీఆర్, అంజలీదేవి సీతారాములుగా కనిపించారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాత శంకర్ రెడ్డికి ఓ ఆలోచన వచ్చింది. వీరిద్దరినీ సీతారాములుగా పూర్తిస్థాయి చిత్రం నిర్మిస్తే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. వెంటనే ఆయన మనసులో 1934లో వచ్చిన ‘లవకుశ’ చిత్రం మెదిలింది. సి. పుల్లయ్యను సంప్రదించారు. ఆయన ఓకే చేద్దాం అన్నారు. అప్పటిదాకా తెలుగులో కలర్ సినిమానే లేదు. అందుకని ఈ సినిమాని గేవా కలర్ లో చేయాలని అనుకున్నారు. సినిమా స్క్రిప్టు విషయంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు.
సదాశివ బ్రహ్మం కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. కొన్ని పాటలు పద్యాలను సముద్రాల రాశారు. మరికొన్ని పాటల్ని కొసరాజుతో రాయించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. పాత సినిమాని యథాతథంగా తీయకుండా మార్పులు చేశారు. స్వర్ణసీతకు సంబంధించిన ఘట్టాన్ని ఇందులో చేర్చారు. లవకుశ సినిమా షూటింగ్ 1958 మార్చి 5న చెన్నైలోని విజయావాహిని స్టూడియోలో ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అల మూడేళ్లు గడిచిపోయింది.
రాయవరంలో ఎంజీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న తోటలో వాల్మీకి ఆశ్రమ సెట్ వేశార. షూటింగ్ నిలిచిపోవడంతో ఆ సెట్ కూడా పాడైపోయింది. పైగా ఇందులో లవకుశులుగా నటించిన పిల్లలు కూడా ఎదిగిపోయారు. సినిమా షూటింగ్ కొనసాగాలి అంటే ఫైనాన్స్ కావాలి. అంతకుముందు షూటింగ్ చేసిన భాగాన్ని చక్కగా ఎడిట్ చేసి డస్ట్రిబ్యూటర్లు అందరికీ చూపిస్తూనే ఉన్నారు. ఆఖరుకు సుందర్ లాల్ నహతా ముందుకొచ్చారు. ఆయన నిర్మాత, పంపిణీదారుడు. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభమైంది.మరో పక్క దర్శకుడు సి పుల్లయ్యగారి ఆరోగ్యం పాడైంది.
దాంతో పుల్లయ్య కుమారుడు సి.ఎస్. రావు ప్రముఖ దర్శకుడు బి.ఎన్. రెడ్డిని కలిసి ఈ సినిమాని పూర్తి చేయమని కోరారు. ఎందుకంటే అప్పటికే ఆయన సీత కథను సినిమాగా తీయాలనుకున్నారు. ఈ సినిమా బాధ్యతలకు చేపట్టడానికి బి.ఎన్. రెడ్డి అంగీకరించలేదు. ‘ఈ సినిమా మీ నాన్న సొత్తు.. నువ్వే దీన్ని పూర్తి చెయ్యి’ అన్నారు. అంతకుముందు పూర్తయిన ఎనిమిది వేల అడుగుల చిత్రానికి తోడు మరో 12 వేల అడుగుల చిత్రాన్నిపూర్తిచేసి ఇచ్చారు సి.ఎస్. రావు.
కలర్ సినిమాకొచ్చిన కష్టాలు
గేవా కలర్ లో సినిమా తీయాలంటే లైటింగ్ ఎక్కువగా కావాలి. దాంతో విపరీతమైన వేడి. క్లోజప్ షాట్ లకైతే నటులు భరించడం కూడా కష్టం. ముఖ్యంగా ఎన్టీఆర్ లో ఓర్పు ఎక్కువ. దేనికీ భయపడలేదు. నటులంతా సహకరించడంతో సినిమా పూర్తయిపోయింది. సినిమా విడుదలైన ప్రతిచోటా జనం బ్రహ్మరథం పట్టారు. శంకర్ రెడ్డి కల ఫలించింది, సుందర్ లాల్ నహతా చేతికి డబ్బే డబ్బు. తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా జనం బళ్లు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చేవారు. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్ర ధరించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. లవకుశుల వయసు మారిపోయినా జనం పట్టించుకోలేదు.
గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా కేవలం కెమెరా పనితనంతో ప్రతిభ చూపడం నాటి ప్రత్యేకత. సినిమా క్లైమాక్స్ లో భూమి రెండుగా చీలి సీతాదేవి తల్లి గర్భంలోకి వెళ్లిపోయే సన్నివేశం హైలైట్ గా నిలిచింది. అలా విడిపోయే సన్నివేశం కోసం వందల ట్రాలీల మీద గడ్డి, మట్టి పరిచారు. ఎండిపోయిన ఆకులు ఎగిరే ఎఫెక్ట్ కోసం పెద్ద పెద్ద ప్రొఫెల్లర్స్ వినియోగించారు. భూమి విడిపోవడం కోసం మట్టితో నిండిన ట్రాలీలను లాగేవారు. అలా భూమి మూడు భాగాలుగా విడిపోయినట్టు చూపారు. ఇక్కడ కెమెరామన్ పి ఎల్ రాయ్ పనితనం కనిపిస్తుంది. రవికాంత్ నగాయిచ్ యారో ట్రిక్స్ ఎంతో ఉపకరించాయి.
ఇందులో ప్రతి పాత్రా పౌరాణిక పాత్రలను గుర్తుచేసింది. నాగయ్య అచ్చుగుద్దినట్టు వాల్మీకి లానే కనిపించారు. శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీదేవి ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. 75 వారాలు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఈ లవకుశ. 62 కేంద్రాలలో శత దినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. 365 రోజులకు కోటి రూపాయలు సాధించిన తొలి దక్షిణాది చిత్రంగానూ రికార్డులకెక్కింది. అప్పట్లో టిక్కెట్ ధర 25 పైసలు మాత్రమే. ఒక్కో థియేటర్ ఉన్న చోట అక్కడ ఉన్న జనాభాకన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా టిక్కెట్లు కొన్నారంటే చూసిన వారే మళ్లీ మళ్లీ చూశారు.
ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా విజయదుంధుబి మోగించింది. తమిళం, హిందీ డబ్బింగ్ సినిమా సైతం ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డును సైతం ఈ సినిమా అందుకుంది. ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలు మాత్రమే ‘లవకుశ’తో సరితూగుతాయి. ముఖ్యంగా కరుణ రసం ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ‘తెలుగునాట రామాలయం లేని ఊరు లేదు, ‘లవకుశ’ పాటలు మోగని గుడిలేదు, వాటిని వినని తెలుగువాడు లేడ’నేది ఒక నానుడిగా మారింది. ఒకవిధంగా చెప్పాలంటే తొలి పాన్ ఇండియా సినిమా ‘లవకుశ’ అనే చెప్పాలి.











