నిధులు కేంద్రానివి .. ప్రచారం మీదా..? సిగ్గులేదా??.
ఏపి ప్రభుత్వం అప్పులతోనే బండిని లాగుతోంది. లక్షల కోట్లును అప్పులు తెచ్చి, సంక్షేమ పథకాలకు పెడుతున్నామని చెబుతున్నారు. కానీ సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఎంతో కాగ్ ఎప్పుడో చేప్పింది. కానీ .. 1.68 లక్షల కోట్లకు లెక్కలు తేలాల్సి ఉంది. ఆర్థిక సంఘం నిథులను పక్కదారి పట్టించి… ఏపీలో గాడిన పెట్టాల్సిన అభివృద్ధిని గాలికొదిలేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏపీ నడుస్తున్న సంక్షేమ పథకాల్లో వెచ్చిస్తున్న నిధులంతా కేంద్రానివే, స్టిక్కర్ మార్చి సొంత పథకాలుగా కలరింగ్ ఇస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. శనివారం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో సోము జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజల మానసిక సంక్షోభానికి సీఎం జగన్ కారణమని విమర్శించారు.
అమరావతి రాజధాని పేటెంట్ రైట్స్ బీజేపీవే..!
రాజధాని అమరావతి పేటెంట్ రైట్స్ మావేనని బీజేపీ కోర్ కమిటీ ఉద్ఘాటించింది. అమరావతి చుట్టూ ఫ్లైఓవర్స్, రహదారుల నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతిపై ఇతర పార్టీల కంటే బీజేపీకే పేటెంటు హక్కు ఉందన్నారు. వేల కోట్ల రూపాయాలు నిధులు రోడ్లు, మౌళిక వసతులకు కేంద్రమే కేటాయించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో 35 రకాల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని ప్రస్తావించింది కోర్ కమిటీ. స్థానిక సంస్థ నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి మానేసి ఇష్టానుసారంగా జగన్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్ల కోసం నిబంధనలు పాటించకపోవడం మూలంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ తెగి,పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యచరణ ప్రకటించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోర్ కమిటీ తీర్మానించింది.