(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
కోస్తా జిల్లాల్లో రేషన్ డీలర్లు సరికొత్త అవతారం ఎత్తారు. కార్డుదారుల నుంచి నేరుగా కిలో బియ్యం రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యం తినడానికి లబ్దిదారులు ఇష్టపడటం లేదు. గతంలో రేషన్ బియ్యం తీసుకుని బయట చిల్లర వ్యాపారులకు కిలో రూ.10కి అమ్ముకునేవారు. కోస్తా జిల్లాల్లో రేషన్ డీలర్లే రంగంలోకి దిగడంతో వినియోగదారులు డీలర్ వద్ద తీసుకున్న బియ్యం అక్కడే అమ్మేసుకుంటున్నారు.
రేషన్ షాపులో బియ్యం తీసుకున్న వినియోగదారులు కరోనా ముందు వరకూ కిలో రూ.10కి అమ్ముకుంటూ వచ్చారు. కరోనా వైరస్ వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సార్లు ఉచితంగా బియ్యం పంపిణీ చేశాయి. దీంతో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసేవారు కూడా ధరలు తగ్గించారు. గ్రామాల్లో కిలో రూ.8, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం రూ.5కే కొనుగోలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
దిమ్మతిరిగే వాస్తవాలు
తాజాగా కృష్ణా జిల్లాలోని రైసు మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల మెరుపుదాడుల్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. రేషన్ డీలర్ల నుంచి నేరుగా మిల్లులకు బియ్యం సరఫరా అవుతున్నట్టు గ్రహించారు. చాలా మిల్లుల్లో రేషన్ బియ్యానికి పాలిష్ వేసి, వాటినే మరలా పౌరసరఫరాల శాఖకు కిలో రూ.25 చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇలా బియ్యం రీసైక్లింగ్ వల్ల రాష్ల్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు రీసైక్లింగ్ చేసిన బియ్యంలో బి విటమిన్ లోపిస్తోందని ఇవి తిన్నవారు అనారోగ్యం పాలవుతారని అధికారులు తెలిపారు.
రేషన్ కోసం ఏటా రూ.6500 కోట్ల ఖర్చు
ఏపీలో ఉన్న కోటి 40 లక్షల కార్డుదారులకు బియ్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.6500 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. కిలో బియ్యం రూ.25కు కొనుగోలు చేయడంతోపాటు, వాటిని గిడ్డంగుల్లో నిల్వ చేసి సంవత్సరం పొడవునా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రజలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున రవాణా కోసం ఖర్చు చేస్తున్నారు. మొత్తం లెక్కిస్తే కిలో బియ్యం లబ్దిదారుడికి చేరడానికి ప్రభుత్వం రూ.30పైనే ఖర్చు చేస్తోంది.
అయినా ఈ బియ్యం ఎవరూ తినడం లేదు. ఈ విషయం ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ రేషన్ ఎత్తివేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనన్న అనుమానంతో ఈ పథకం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి కిలోకు ఖర్చుపెట్టే రూ.30 నేరుగా వినియోగదారులకు ఇస్తే మార్కెట్లో వారిష్టం వచ్చిన బియ్యం కొనుగోలు చేసుకుంటారని దీని ద్వారా ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉంటుందని భావిస్తున్నారు.
రేషన్కు నగదు బదిలీ
రేషన్ బియ్యానికి బదులు నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, అక్కడ ప్రజాభిప్రాయం సేకరించి రాష్ట్రం మొత్తం అమలు చేయాలని భావిస్తోంది.
ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా వాస్తవంలో ఇది సాధ్యం కాదని గ్రహించారు. అందుకే ప్రభుత్వం నగదు బదిలీ చేస్తే, లబ్దిదారులు మరికొంత చేతినుంచి వేసుకుని సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం దక్కుతుంది.