సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా రూపొందుతుందంటే, ప్రేక్షకులందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. అందుకు కారణం కథాకథనాలకు సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఇచ్చే ప్రాధాన్యత. కథలో బలం .. పాత్రల రూపకల్పనలో వైవిధ్యం .. సంగీత సాహిత్యాల్లో నాణ్యత ఉండేలా వాళ్లు శ్రద్ధ పెడతారు. అందువల్లనే ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో విజయాలు సాధించిన వాటి సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఆ బ్యానర్లోనే నిర్మితమైన మరో ప్రతిష్ఠాత్మక చిత్రమే ‘ప్రతిధ్వని’. బి.గోపాల్ దర్శకత్వంలో శారద ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, తాజాగా ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
*’ప్రతిధ్వని’ కథను శారద పాత్ర ప్రధానంగా మేము అనుకున్నాను. ఆ కథలో అన్నయ్య చిన్న మార్పు చేయడం వలన, అది అర్జున్ కథగా మారిపోయింది. దాంతో ఈ కథపై అన్నయ్య .. నేను వాదించుకుంటూ ఉంటే అక్కడికి రామానాయుడు గారు వచ్చారు. “ఇలాగైతే ఈ సినిమా ఆడదు సార్” అని అన్నయ్య ఆయనతో అన్నాడు. “ఇలా మారిస్తే అసలు ఆడదు సార్” అని నేను ఆయనతో అన్నాను. “ఇద్దరూ బాగుండదని చెబుతున్నప్పుడు నేనెందుకు ఈ సినిమా తీయాలి” అన్నారు ఆయన. ఆ తరువాత కాస్త మెత్తబడి, “గోపాలకృష్ణా .. నువ్వేమనుకుంటున్నావో చెప్పు” అన్నారు.
*అప్పుడు నేను .. “సార్ .. అర్జున్ ఆల్రెడీ తమిళ .. కన్నడ భాషల్లో హీరో. అక్కడ ఆయన చేసిన సినిమాలన్నీ అనువాదాలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ‘ప్రతిధ్వని’ ప్రేక్షకుల ముందుకు వెళ్లేలోగా, అర్జున్ యాక్షన్ సినిమాలను వాళ్లు చాలా చూసేసి ఉంటారు. అదే శారదగారిని పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తే కొత్తగా ఉంటుందండి” అన్నాను. అప్పుడు రామానాయుడు మా అన్నయ్య వైపు చూసి, “వెంకటేశ్వరరావు గారు నాకు ఇది నచ్చింది .. ఇలాగే చేద్దాం” అన్నారు. అప్పుడు సురేశ్ బాబుగారు కూడా రామానాయుడిగారి అభిప్రాయానికే ఓటు వేశారు.
*ఎందుకంటే ఇది అర్జున్ స్టోరీ అయితే రెగ్యులర్ స్టోరీ అయిపోతుంది. ఇది ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కథ. డ్యూటీ కోసం భర్తను కొట్టడానికి కూడా వెనుకాడని పోలీస్ ఆఫీసర్ కథ ఆమె అని చెప్పినప్పుడే రామానాయుడుగారు ఆ కథ పట్ల ఆసక్తిని చూపించారు. అందువలన ఆ దిశగానే కథను నడిపించే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ సినిమా విడుదలైన మూడు రోజుల వరకూ ఫ్లాప్ అనే ప్రచారం జరిగింది .. కానీ ఆ సినిమా అద్భుతంగా ఆడింది. మా కెరియర్లోని చెప్పుకోదగిన సినిమాల్లో ‘ప్రతిధ్వని’ ఒకటిగా నిలవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- ఆ నిర్మాతకి కథ చెప్పనన్నా: పరుచూరి గోపాలకృష్ణ