ఏపీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నంపెట్టే భూమిని సైతం భవిష్యత్తు తరాలకోసం ధారదత్తం చేశారు ఆ ప్రాంత రైతులు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మించి తీరుతాం .. మీ భవిష్యత్తే కాదు.. రాష్ట్ర భవిత కూడా బాగుంటుందని రైతుల నుంచి భూసమీకరణ ద్వారా సింహభాగం, సేకరణ ద్వారా కొంత భాగం వ్యవసాయ భూములు రమారమి 34 వేల 320 ఎకరాల పైచిలుకు సేకరించారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట, కౌలు పరిహారం, రిటర్నబుల్ ప్లాట్స్ వంటి స్పష్టమైన అంశాలతో నాటి ప్రభుత్వం ముందుకురావడంతో 29 గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. ఆ తరువాత అది సరిగ్గా 2019, డిసెంబర్ 17 న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ఆశలకు, ఆకాంక్షలకు రివర్స్ గేర్ వేసి అథఃపాతాళానికి తొక్కిన మాదిరిగా మూడు రాజధానుల మంత్రాన్ని అందుకున్నారు. నాటి నుంచి నేటి వరకు జగన్ ఆడుతున్న మూడు ముక్కలాటలో రైతులతో పాటు, అనేక పారిశ్రామిక కారిడార్లు, నిర్మాణ రంగ సంస్థలు, రియల్ ఎస్టేట్, స్టార్టప్ కంపెనీలు, విదేశీ సంస్థల పెట్టుబడులు, జాతీయ విద్యా సంస్థలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కీలక రంగాలన్నీ చిత్తై పోయాయి. నేటికి ఆ నష్టాలను పూడ్చుకోవాడానికి ఏపీని వదిలి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చివరకు ఖండాలను దాటి మరి తరలిపోవాల్సిన పరిస్థితి పట్టింది. ఆయా రంగాలకు. కానీ వ్యాపారం, మోసం, దగా, నయవంచన, మాటతప్పడం, దిగజారి బ్రతకడం, అవకాశవాదం వంటి అష్టదరిద్రాలు తెలియని రైతు మౌనంగా భూములిచ్చిన ప్రాంతంలోనే దీక్షలు చేస్తూ ఉండిపోయాడు. అవకాశవాదం యొక్క తీరు తెన్నెలు తెలియని రైతు భావితరాల భవిష్యత్ కోసం రాజధాని తరలింపును నిరసిస్తూ ఆనాటి నుంచి నేటి వరకు 680 రోజులు దీక్షలు చేస్తూ తన నిరసనలను వివిధ రూపాల్లో తెలుపుతునే ఉన్నాడు.
‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర
ప్రజా రాజధాని పేరుతో బీజం పడిన రైతు కలల రాజధానిని కాపాడుకోవడానికి ఏడాదిన్నర నుంచి న్యాయ స్థానం మెట్లెక్కారు. కేసులు వేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. కానీ నేటికి ఫలితం దక్కలేదు. నిత్యాగ్నిహోత్రంలా దీక్షలు చేస్తున్న రైతుల గోడు కూతవేటు దూరంలో ఉన్న ముఖ్యమంత్రికి కనిపించకపోయినప్పుటికీ.. అంతర్జాతీయ సమాజానికి రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే రైతు నిరసనలు సమర్ధనీయమని ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మద్దతే. ఈ క్రమంలో 680 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన చూసి జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు పాదయాత్ర తలపెట్టాలని తలిచారు. నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు అంటే 45 రోజులు పాటు ‘న్యాయస్ధానం టూ దేవస్థానం’ నిరసన ట్యాగ్ లైన్ తో మహాపాదయాత్రకు జేఏసీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది. ఈ పాదయాత్రలే కొందరిని ముఖ్యమంత్రులను చేస్తే .. మరికొందర్ని మంచి లీడర్ గా కూడా తీర్చిదిద్దింది. ఈ పాదయాత్రతోనే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే .. ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పాదయాత్రతో ఏపి పాలన పగ్గాలు చేపట్టాడు.
మహాపాదయాత్రకు ‘రోడ్ మ్యాప్’ ఇలా..
అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ అందుకున్న రైతు నినాదం.. సుదీర్ఘ దీక్షలుగా మారి సరిగ్గా రెండు నెలలకు తక్కువ రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ‘న్యాయ స్థానం టూ దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగే మహాపాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభం కానున్నది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలుపుకుంటూ పాదయాత్ర సాగి.. చివరకు తిరుమల శ్రీవారి చెంతకు చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ.. గ్రామగ్రామాన ప్రభుత్వ విధానాలను, వైఫల్యాల వైఖరిని తెలియచెప్పాలని భావిస్తోంది. అమరావతి జేఏసీ, రైతు సంఘాల నాయకులు తలపెట్టిన ఈ పాదయాత్రకు ఇప్పటికే తెలుగుదేశంపార్టీతోపాటు, జనసేన, సీపీఐ, సీపీఎం, దళిత జేఏసీలు మద్దతు ప్రకటించాయి. ముందుగా పాదయాత్ర తుళ్లూరు నుంచి తాడికొండ ఆ తరువాత గుంటూరు, అక్కనుంచి ఒంగోలు, నెల్లూరు, కావలి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి మీదిగా తిరుమల శ్రీవారి చెంతకు చేరడంతో ముగుస్తోంది.
అనుమతిపై డైలమాలో డీజీపీ ..
నవంబరు 1 నుంచి రైతులు తలపెట్టిన పాదయాత్రకు ప్రభుత్వ అనుమతులతోనే అంతా ముడిపడి ఉంది. అనుమతులు కోరుతూ.. అమరావతి జేఎసీ, రైతుల సంఘాల నాయకులు డీజీపీ గౌతం సవాంగ్ కు వినతి పత్రం సమర్పించారు. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖాలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపి, నవంబరు 01 న తలపెట్టిన ‘న్యాయ స్థానం టూ దేవస్థానం’ పాదయాత్రకు అనుమతిపై అక్టోబరు 28 సాయంత్రం 5 గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అనుమతులిచ్చే విషయంపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. దీంతో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా డీజీపీ సవాంగ్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు ప్రకటించారు.