గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య రగడ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఒక నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు పట్టుకోసం గ్రూపులు కట్టడంతో వైసీపీలో రగడ మొదలైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న వల్లభనేని వంశీతో కలసి పనిచేసేదే లేదని, ఆ ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు కుండబద్దలు కొట్టారు. క్యారెక్టర్ చంపుకుని వంశీతో పనిచేయలేనని, వంశీ వైసీపీలో అద్దెనాయకుడని హాట్ కామెంట్లు చేశారు. దీంతో బాపులపాడు మండలం కాకులపాడు సచివాలయం శంకుస్దాపనలో యార్లగడ్డ, వల్లభనేని వర్గీయులు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వంశీ చెప్పినా ఎవరూ వినకపోవడంతో చేసేది లేక వెనుతిరిగారు. ఏ గ్రామం వెళ్లినా ఈ లొల్లి తప్పడం లేదని సీఎంతో ఒక్కసారి మాట్లాడుకుని రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఎమ్మెల్యే వంశీ ప్రకటించారు. దీంతో గన్నవరం వైసీపీలో ఏ జరగబోతోందో అని అందరూ ఆసక్తి గమనిస్తున్నారు.
వైసీపీ పెద్దల వద్దకు చేరిన గన్నవరం గొడవలు
వల్లభనేని వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచీ గన్నవరం వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2014లో వంశీ చేతిలో ఓటమిపాలైన దుట్టా రామచంద్రావు కూడా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో యార్లగడ్డ, వల్లభనేని, దుట్టా గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఏ కార్యక్రమం పెట్టినా గ్రూపుల మధ్య లొల్లి తప్పడం లేదు. గన్నవరం నేతల గొడవలు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వద్దకు చేరింది. ఇవాళ కంకిపాడు మండలం పునాదిపాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అనంతరం గన్నవరం వైసీపీ నేతల మధ్య కూడా రాజీ చేస్తారని తెలుస్తోంది.
ముగ్గురూ ముగ్గురే.. ససేమిరా..
వల్లభనేని వంశీతో మాత్రం కలసి పనిచేసేది లేదని, ఈ విషయం సీఎం జగన్మోన్ రెడ్డికి కూడా చెప్పానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ముగ్గురు నేతలు పట్టుకోసం పాకులాడటమే ప్రధాన సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వంశీని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పంపించాలని అధిష్ఠానం భావిస్తోందట. ఇదే జరిగితే విజయవాడ పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయవాడ పార్లమెంటులో గతంలో ఓసారి పోటీ చేసి వంశీ ఓటమి పాలయ్యారు. అందుకే విజయవాడ పార్లమెంటుపై తనకు ఆసక్తి లేదని వంశీ మొదటి నుంచీ చెబుతున్నారట.
రాజీ పడతారా….
రెండు కత్తులే ఒక ఒరలో ఇమడవు అంటారు. అలాంటిది మూడు కత్తులు ఎలా ఇముడుతాయి.. అందుకే గన్నవరంలో ముగ్గురు నేతలు కలసి పనిచేస్తారనుకోవడం భ్రమే అవుతుంది. వారిలో ఒకరినన్నా పక్క నియోజకవర్గాలకు తరలించాలంటే సాధ్యం కావడం లేదు. దీంతో గన్నవరం వైసీపీ నేతలను ఎలా రాజీకి తేవాలో వైసీపీ అధిష్ఠానానికి కూడా అర్థం కావడం లేదట. అందుకే ముందుగా దుట్టాకు నామినేటెడ్ పదవి ఇచ్చి దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏ పదవి ఇచ్చినా దుట్టా మాత్రం గన్నవరం వదిలేలా కనిపించడం లేదు. గన్నవరం వైసీపీ నాయకుల గొడవలతో వైసీపీ కార్యకర్తల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.











