అటు జాతీయ స్థాయి రాజకీయాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో అప్పుడే సర్వేల గోల మొదలైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మరోమారు గద్దెనెక్కుతాయా? లేదంటే విపక్షంలో ఉన్న పార్టీలు అధికారాన్ని తన్నుకుపోయాతా? అసలు ఈ పరిణామాలకు దారి తీసే అంశాలేమిటి? అన్న కోణంలో ఆయా సర్వేలు తెర వైలర్ గా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల దాకా సమయం ఉన్న ఏపీలో అదికార పార్టీ వైసీపీ.. తన ఫెర్ఫార్మెన్స్ పై తన సొంత సర్వే సంస్థతో సర్వే చేయించుకుందని, అందులో జగన్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం తెలిసి వైసీపీ డిఫెన్స్లో పడిపోయిందన్న వార్తలు మొన్న కలకలం రేపాయి. తాజాగా లోకల్ యాప్ పేరిట వచ్చిన ఓ సర్వే.. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోని పార్టీ భవిష్యత్తు ఏమిటన్న విషయాన్ని తేల్చేసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ, తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు అధికారం చేజిక్కించుకుంటాయని ఆ సర్వే తేల్చేసింది. అంతేకాకుండా ఏపీకి చంద్రబాబు మరోమారు సీఎం కానుండగా.. తెలంగాణకు కొత్తగా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపడతారని తేల్చేసింది.
జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత
మొన్నటి ఎన్నికలకు ముందు అలవిగానీ హామీలు గుప్పించిన జగన్.. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టారని, అయితే ఇప్పుడు ఆయన చేతగానితనం బయటపడిపోయిందని జనం భావిస్తున్నట్లుగా ఆ సర్వే చెప్పింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 50 శాతం మేర ఓట్లను కొల్లగొట్టగా.. టీడీపీ 45 శాతం ఓట్లకే పరిమితమైపోయింది. ఇక జనసేన 6 శాతం ఓట్లను సాధించినా.. ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. అయితే జగన్ రెండేళ్ల పాలన చూశాక.. ఏపీ జనం తమ మనసు మార్చుకున్నారని తమను మోసం చేసిన జగన్ను తప్పనిసరిగా సీఎం పదవి నుంచి దించేయాల్సిందేనని భావిస్తున్నారని ఆ సర్వే చెప్పింది. జగన్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్న వారు కూడా ఇదే భావనతో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆ సర్వే చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ ఓటు షేరింగ్ 45 శాతానికి పడిపోగా.. అదే సమయంలో టీడీపీకి కూడా 45 శాతం మేర ఓట్లు వస్తాయని.. వైసీపీకి చెందిన ఓట్లలోనే భారీ స్థాయిలో బీజేపీ- జనసేన కూటమికి మరలుతాయని తేలిందట. అంటే.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీపై వైసీపీకి దక్కిన ఆధిక్యం మొత్తం ఇటు టీడీపీకి కొంత, మరికొంత బీజేపీ-జనసేన కూటమికి మరలిపోగా.. వైసీపీ చతికిలబడిపోవడం ఖాయమని ఆ సర్వే తేల్చింది.
గులాబీ దళానికి మూడో స్థానం
తెలంగాణాలో నిర్వహించన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చావుదెబ్బకొట్టబోతునున్నారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..గులాబీ దళానికి మూడో స్థానమే గతి అని తేలిందట. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ తెలంగాణలో కొత్తగా అధికార పార్టీగా అవతరించనుందట. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనంటూ భుజాలు చరుచుకుంటున్న బీజేపీ రెండోస్థానంతో సరిపెట్టుకుంటుందట. ప్రజల్లో తన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించాకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు పదిలక్షల రూపాయలు ఇస్తానంటూ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని, మరెన్నో ప్రజాకర్షణ పథకాలకు ఆయన తెరతీస్తున్నారని ఈ సర్వే తేల్చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 40శాతం, బీజేపీకి 34 శాతం, టీఆర్ఎస్ కు 26శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్ధ పేర్కొంది. వెరసి కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్న మాట. ఈ లెక్కన అటు ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడతారన్న మాట.