మన దేశంలో సినిమా రంగానికీ రాజకీయ రంగానికీ అవినాభావ సంబంధం ఉంది. తాజగా ఓ ముఖ్యమంత్రి తనయుడు హీరోగా తెరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావు మొదట నటులు. అందుకే ఆయన తనయులు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ నటించినా స్వర్గీయ హరికృష్ణ కుమారులు ఎన్. టి . ఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నా విమర్శలు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయానికి వస్తే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు.
‘ఓకే ఓకే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఈ మధ్యనే అదితిరావు హైదరితో కలిసి ‘సైకో’ అనే సినిమా చేసి హిట్ కొట్టారు. ఇదంతా పొలిటికల్ గా, ఇమేజ్ పెంచుకోవడానికి అనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటక విషయానికి వస్తే మాజీ ప్రధాని దేవ గౌడ మనవడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ‘ జాగ్వర్ ‘ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమా సక్సెస్ కాలేదు. మళ్లీ కొండా విజయకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్ గౌడ. ఇది కూడా సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి అనే వేరే చెప్పనక్కరలేదు.
కొంతకాలం క్రితం రాజకీయ ఉద్దేశంతో కాకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు ప్రధాన పాత్రధారిగా, బాలబాలికలతో ‘మాయా బజార్’సినిమా తీయడానికి ప్లాన్ చేశారు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. మహారాష్ట్ర ఒకనాటి మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశముఖ్ కుమారుడు రితీష్ దేశ్ ముఖ్ హీరో అయ్యారు. ఇప్పుడు మహారాష్ట్ర టైగర్ గా పేరొందిన శివసేన నాయకుడు స్వర్గీయ బాల్ థాకరే మనవడిని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు రచయితతో ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేయిస్తున్నారని ఫిలింనగర్ లో వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని కుదిరితే ఒక తెలుగు యువ దర్శకుడు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.











