జనమే బలం..ఇటీవల చంద్రబాబు తరచుగా చెబుతున్న మాట. ముగ్గురు,నలుగురు పిల్లలను కనాలంటూ ఆయన సూచిస్తున్నారు. ఐతే ఆయన సూచనలకు ఓ లెక్కుంది. నిజానికి ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాదిన జనాభా వేగంగా తగ్గిపోతుంది. దీనిపై ఓ రకంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉత్తరాధి ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరుగుతాయి..కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదే పదే తన ప్రసంగాల్లో ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచిస్తున్నారు.
ఐతే చంద్రబాబు మాటలపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు పిల్లలను కనొద్దన్నారని, ఇప్పుడు చెపుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అప్పుడు దేశంలో అభివృద్ధి తక్కువ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తక్కువ. అందుకే అప్పుడు జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను చంద్రబాబు కఠినంగా అమలు చేశారు. దాంతో మంచి ఫలితాలే వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశ్రామికీకరణ పెరిగింది. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. జనాభా నియంత్రణ కారణంగా చైనా, జపాన్ లాంటి దేశాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మానవ వనరుల కొరత ఇప్పుడు ఆ రెండు దేశాలను పీడిస్తోంది. అలాంటి పరిస్థితి ఇండియాలో రాకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పిల్లలను కనాలని సూచిస్తున్నారు.
తాజాగా అమరావతిలో ప్రపంచ జనాభా దినోత్సవంపై మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అన్నివర్గాల నుంచి సలహాలు స్వీకరించి త్వరలోనే ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామన్నారు చంద్రాబాబు. ప్రభుత్వ కార్యాలయాల్లో చైల్డ్కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని..అందుకే పిల్లల పెంపకం, ఆలనా పాలనా భారంగా అనిపించేవి కాదన్నారు. క్రమంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. మళ్లీ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదేసి కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నామని, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అదనంగా మరో 10-15 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభాతో పాటు సంతానోత్పత్తి రేట్ తగ్గిపోతోందన్నారు చంద్రబాబు. యువత తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారు. సంతానోత్పత్తి రేట్ 2.1 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుందన్నారు. మన దేశంలో సంతానోత్పత్తి రేట్ బిహార్లో 3.0, యూపీలో 2.4, ఝార్ఖండ్లో 2.3 ఉండగా.. ఏపీలో 1.7 ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో జనాభా మరింత తగ్గిపోతుంది. యువత తగ్గి.. వృద్ధులు పెరుగుతారని చెప్పారు. జనాభా సమతుల్యత సాధించాలంటే సంతానోత్పత్తి రేట్ 2.1 ఉండాలని సూచించారు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్న దేశాల గురించి సైతం చంద్రబాబు వివరించారు. జపాన్లో పిల్లలు స్కూలుకు వెళ్లే వరకు చైల్డ్ కేర్ సేవలు అందిస్తున్నారని చెప్పారు. పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఎక్కువ సంతానం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేయడమో లేదా తక్కువ అద్దెకే ఇళ్లు ఇవ్వడమో చేస్తున్నారని చెప్పారు. దక్షిణ కొరియాలో ప్రత్యక్ష నగదు బహుమతులు అందిస్తున్నారన్నారు. వివాహానికి, కాన్పులకు, ఐవీఎఫ్కు సాయం చేస్తున్నారని వివరించారు. సింగపూర్లో బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు ఇస్తున్నారు. మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము జోడించి పిల్లల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రష్యాలో రెండో బిడ్డను కంటే ఫ్రీ హెల్త్కేర్ కింద గర్భిణులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి జీవితాంతం ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. చైనాలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే రూ.12 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆలోచిస్తున్నామన్నారు చంద్రబాబు.











