ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ వెహికిల్ తయారీ దిగ్గజం టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే టెస్లా ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఐతే టెస్లా తయారీ యూనిట్ను ఏపీకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కార్ల తయారీలో మంచి గుర్తింపు ఉన్న టెస్లా ఏపీలో పెట్టుబడులు పెడితే భవిష్యత్లో మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది సర్కార్. టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ఎలాన్మస్క్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్లో పెట్టుబడిపై ఎలాన్ మస్క్తో చర్చించారు ప్రధాని మోదీ. ఈ సమావేశం తర్వాత కార్ల తయారీ యూనిట్ను భారత్లో నెలకొల్పడానికి టెస్లా కసరత్తు ముమ్మరం చేసింది. దీంతో కూటమి సర్కార్ రంగంలోకి దిగింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ-EDB రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో పోర్టు కనెక్టివిటీతో పాటు ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికిప్పుడూ టెస్లా కార్ల తయారీ యూనిట్ను నెలకొల్పకపోయినా…పోర్ట్ యాక్సెస్తో టెస్లా రెడీమేడ్ కార్లను దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు వీలుగా అవసరమైన భూమితో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా కూటమి సర్కార్ ఆఫర్ చేస్తోంది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో టెస్లా కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాటరీ తయారీ యూనిట్లు నెలకొల్పడానికి అవసరమైన ఎకోసిస్టమ్ రెడీగా ఉంది.
ప్రస్తుతం టెస్లా కోసం ఏపీతో పటు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోటీ పడుతున్నాయి. దేశంలో దాదాపు 60 శాతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ను ఏపీకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2017లోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ సైతం ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి..ఏపీలో ఈవీ కార్ల తయారీ నెలకొల్పాలని కోరారు. ఇప్పుడు ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో భారత్లో అడుగు పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రయత్నాల్లో వేగం పెంచింది.
ఇక ఏపీలో ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. 2014-19 మధ్యలో కియా ప్లాంట్ పనులు ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు కియా కార్లు ఎగుమతి అవుతున్నాయి. కియా రాకతో అనంతపురం జిల్లా పెనుగొండ రూపురేఖలు మారిపోయాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. అంతే కాదు సమీప ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా పెరిగాయి. ఈ అనుభవంతోనే చంద్రబాబు టెస్లాను సైతం ఏపీకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.











