కల్వకుర్తి పంప్హౌస్ పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పంపులు పేలిపోయాయనే సమాచారం అందుకుని వాటిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి, మాజీ ఎంపి మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి పంప్ హౌస్ పేలిపోయినట్లు సమాచారం అందుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి కల్వకుర్తి పంప్ హౌస్ను పరిశీలించేందుకు శనివారం బయలుదేరారు. అయితే నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డపైనే బైఠాయించారు.ఈతరుణంలో తెలకపల్లలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే రిజర్వాయర్కు సంబంధించిన ఎంపి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘కోల్లాపూర్లో ఎల్లూర్ రిజర్వాయర్(కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) మోటార్లు నీళ్లల్లో మునిగినట్లు స్థానికుల సమాచారం అందించారని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. జరిగిన ప్రమాదాన్ని కప్పిపుచ్చకుండా కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది…
నాగర్కర్నూల్ జిల్లా ఎల్లూరు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్లో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పంప్హౌస్లో 45 మీటర్ల ఎత్తు నీరు చేరడతో పంప్ హౌస్లోని దాదాపు 5 మోటార్లు నీట మునిగాయని సమాచారం. అయితే అప్రమత్తమైన ఎంజిఎల్ఐ ప్రాజెక్టు అధికారులు వెంటనే తేరుకొని పంప్హౌస్కు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలిసింది. కానీ అప్పటికే ఐదు మోటార్లు నీట మునిగి జరగరాని నష్టం జరిగిందని కాంగ్రెస్ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును, మోటార్లను పరిశీలించేందుకు రేవంత్ రెడ్డి, మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో అసలు ఏం జరిగిందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.