(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నంలో కోవిడ్ రోగుల బాధలు దయనీయంగా మారుతున్నాయి. ఆసుపత్రిలో బెడ్ల కోసం రోగులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో రోగులు ఫుల్గా ఉండడంతో అనేకమంది అంబులెన్సుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుల్..
విశాఖ విమ్స్ ఆస్పత్రి, కేజీహెచ్, ఈఎన్టి, మానసిక చికిత్సాలయం, చెస్ట్ హాస్పిటల్ ఇలా ఎక్కడ చూసినా ఆక్సిజన్ అవసరమైన రోగులకు చికిత్స అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క ప్రభుత్వాసుపత్రులే కాదు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోగుల అత్యవసర పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో మాత్రం సఫలం అవుతున్నాయి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.
104 కాల్ సెంటర్తో తిప్పలు..
ప్రభుత్వ ప్రకటనలకు,వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రతి గంటకు ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను ఆన్ లైన్లో అప్లోడ్ చేస్తామని, వాటిని బట్టి రోగులు ఆస్పత్రుల్లో చేరవచ్చు అని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ ఏ హాస్పిటల్కు వెళ్ళినా రోగుల్ని చేర్చుకునే పరిస్థితి విశాఖలో కనిపించడం లేదు. బెడ్లు ఎప్పుడు ఖాళీ అవుతాయా అని రోగి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట చెట్ల కింద పగలు, రాత్రి పడిగాపులు కాస్తున్నారు. అప్పటి వరకు అంబులెన్సులోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. దీంతో అనేక ఆసుపత్రుల వద్ద అంబులెన్స్లే చికిత్స కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని గంటలపాటు పేషెంట్లకు అంబులెన్స్లోనే చికిత్స అందించాల్సి వస్తోంది.అప్పటికీ పరిస్థితి చేజారి పోతే కాస్త ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలోను మంచాల కొరత ఉండటంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. అధికారులు 104 కాల్ సెంటర్కు కాల్ చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే ఆ నంబరు ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియడం లేదు. గంటల కొద్దీ ఆ నంబర్ కోసం ప్రయత్నించి రోగి తరపు బంధువులు విసుగు చెందుతున్నారు. ఈ కాల్ సెంటర్ పనితీరుపై స్వయంగా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కూడా అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 20 నిమిషాల పాటు ప్రయత్నించి విసుగు చెందారు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే.. సింపుల్గా సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసారు. వాస్తవానికి ఈ కాల్ సెంటర్ నెంబర్ రోగులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదనే చెప్పాలి.
ఆక్సిజన్ సమస్యలు అధికం..
ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో అధిక శాతం రోగులకు ఆక్సిజన్ సమస్యలు ఎదురవుతున్నాయి. అంబులెన్స్లో ఉండే ఆక్సిజన్ ద్వారా కొన్ని గంటల పాటు రోగుల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు కొరవడడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేజీహెచ్లో కొద్ది రోజుల క్రితం వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఏడాదిన్నర పాపను కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేర్చుకునేందుకు బెడ్లు ఖాళీగా లేక సుమారు గంటన్నరపాటు అంబులెన్స్ లోనే చికిత్స అందించారు. మరుసటి రోజే ఓ 14 ఏళ్ల బాలికకు కొన్ని గంటలపాటు అంబులెన్సులోని చికిత్స చేశారు. చివరకు ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ అంబులెన్స్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అధిక సంఖ్యలో వైరస్ బారిన పడిన రోగులతో కనిపిస్తున్నాయి. మరోవైపు వైద్య సిబ్బంది తమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో ఎలా సేవలు అందించగలమని ఆందోళనకు దిగుతున్నారు.
బెంచీల పైనే రోగులు..
విశాఖ ENT హాస్పటల్ లో వెంటిలేటర్ బెడ్స్ లేక బెంచ్పై ఆక్సిజన్ పెట్టడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక పెదనడుపూరుకి చెందిన ఇందల సత్యారావు అనే కరోనా పాజిటివ్ రోగికి శరీరంలోని ఆక్సిజన్ శాతం 54కి తగ్గడంతో వెంటిలేటర్ తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ENT హాస్పటల్లో వెంటిలేటర్ బెడ్స్ ఖాళీ లేవని సిబ్బంది చెప్పగా, జిల్లాలో గల అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు నిన్నటి సాయంత్రం నుండి రాత్రంతా తిరిగినా ఎక్కడా వెంటిలేటర్ బెడ్స్ లేవని చెప్పడంతో వారి బందువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి లేఖ..
కోవిడ్ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు.నగరంలోని గ్యాస్ కంపెనీలు అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో ఆక్సిజన్ పడకలను పెంచుకోలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. రోగులకు సకాలంలో తగిన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.