ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న ఏకైక పార్టీ బీజేపీ. ఇక ఈటల రాజేందర్ ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలతో, అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఫామ్ లో బీజేపీలోకి వెళ్తారా.. లేక కొత్త పార్టీ వంటి ఆలోచన ఏమైనా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఆచితూచి అడుగులు
ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తప్పించగానే ఆయన కొత్త పార్టీ వైపు మొగ్గుతారా… లేక వేరే పార్టీలో చేరుతారా… అనే సందేహాలు వచ్చాయి. ఆయన తరచుగా తన అనుచరులతో సంప్రతింపులు జరుపుతున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి హుజురాబాద్ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందని భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరగలేదు. అయితే హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక మండలాల ముఖ్య నేతలతో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలు వినవస్తున్నాయి. హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఈటల రాజేందర్ స్పష్టం చేయడంతో రాజకీయ భవిష్యత్తపై ఆచీతూచీగా అడుగు వేస్తారేమోనని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కోల్డ్ వార్ అప్పట్నుంచే…
రాష్ర్ట రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. కేసీఆర్ తర్వాత ఈటల పేరు తెరపైకి వస్తుండేది. కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు ఉన్నప్పటికీ.. ఈటల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండేది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా తప్పించాలని ప్లాన్లు వేశారు. మంత్రి పదవి కూడా చివరి నిమిషంలో ఇచ్చారు. పార్టీ నాటి నుంచి కేసీఆర్ వెంట ఈటల తిరిగి.. ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. అయినా ఈయనపై చిన్నచూపు మొదలైంది. మంత్రి పదవి వచ్చిన తరువాత కూడా ‘పార్టీ ఓనర్లం’ అంటూ హుజురాబాద్ లో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మరింతగా సీఎంకు .. ఈటలకు నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది.
సరైన సమయం కోసమేనా..?
మున్సిపల్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు పూర్తికాగానే ఈటలపై వేటు పడింది. ఈటల కూడా సరైన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన హుజురాబాద్ పర్యటనలోనే భవిష్యత్ కార్యాచరణ వాయిదా వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై కూడా ఇంకా ఎటూ తేల్చలేదని వార్తలు వినవస్తున్నాయి. భవిష్యత్తులో తనతో కలిసి వచ్చేవాళ్లెవరు… ఎవరెవరిని కలుపుకుని ముందుకెళ్లాలి వంటి లెక్కలను ఆయన బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మంతనాలు, తర్జనభర్జనలు
తెలంగాణ మంత్రి వర్గం నుంచి ఈటలను తొలగించగానే ఆయనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అమెరికా,ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈటలకు మద్దతు ఇస్తున్నారు. ఈటల కాంగ్రెస్ లోకి వస్తే.. తాను అధిష్ఠానంతో మాట్లాడుతానని రేవంత్ రెడ్డి హింట్ ఇస్తుండటంతో, ఈటెల కాంగ్రెస్ లో చేరుతారా అనే గుసగుసలు వినిపించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటలతో సమావేశమైనట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే గతంలో ఈటల రాజేందర్ బీజేపీ విధానాలను ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బీజేపీలో చేరకపోవచ్చు అని ఈటల వర్గీయులు అంటున్నారు. అయితే ఇక ఈటల ముందున్నది ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయని అనుచరులు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ వైపు మొగ్గ చూపుతారా? లేక రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొదండారామ్ లాంటి వాళ్లను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేస్తాడా? అనే విషయాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. మొత్తంగా ఈటల భవిష్యత్ పై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందేమో..











