దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 3.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.3800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే యూపీ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, బీహార్, ఒరిస్సా, ఝార్ఖండ్ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయినా కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. ఇప్పటికే దేశంలో కోటి 69 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో కోటి 39 లక్షల మంది కోలుకున్నారు. 2 లక్షల మందికిపైగా చనిపోయారు. ఇంకా దేశంలో 30 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరికి అదనంగా ప్రతి రోజూ 3.8 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలకు అధికారాలు అప్పగించి, కేంద్రం చేతులు దులిపేసుకోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
అప్రమత్తమైన ప్రపంచ దేశాలు
భారత్లో కరోనా కల్లోలం సృష్టించడంతో అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. భారత్లో ఉన్న తమ పౌరులు తిరిగి స్వదేశాలకు వచ్చేయాలని చాలా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. భారత్లో ఉన్న అమెరికా పౌరులంతా వెంటనే తిరిగి వచ్చేయాలని యూఎస్ అధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. భారత్ దేశంలో వెంటనే లాక్ డౌన్ వేయాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలు సరిహద్దులు మూసివేశాయి. దేశంలో ఇప్పటికే 30 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో కరోనా రోగులకు వైద్య సేవలు అందక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక రాష్ట్రంలో ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మే 15 నాటికి రోజుకు పది లక్షల కేసులు వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లోనే ఏపీలో 2 లక్షల పాజిటివ్ కేసులు రావడం గమనిస్తే కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీలో 11.5 లక్షల మంది కరోనా బారిన పడగా, 8 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా ఏపీలో లక్షా 80 వేల కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తెలంగాణలోనూ కరోనా కల్లోలం ఆగలేదు. నిన్న ఒక్క రోజే 6 వేల మంది కరోనా భారినపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో 6 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 5 లక్షల మంది కోలుకున్నారు. 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా తెలంగాణలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనా టెస్టులు చేయించుకునేవారు, టీకాలు తీసుకునే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు లేక జనం గగ్గోలు పెడుతున్నారు.
దుర్గగుడిలో కరోనా కాటుకు సిబ్బంది బలి
విజయవాడ దుర్గగుడిలో పనిచేసే సిబ్బందిలో ఇప్పటికే 8 మంది కరోనా బారినపడి చనిపోయారు. మొత్తం 300 మంది సిబ్బంది, మరో 200 మంది కాంట్రాక్టు సిబ్బంది ఉండగా ఇప్పటికే 100 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వారిలో 80 మంది కోలుకున్నారు. మరో 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే దుర్గగుడి సిబ్బంది ముగ్గురు కరోనాతో చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక తిరుమలలో కరోనా బారిన పడి 16 మంది సిబ్బంది చనిపోయారని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో 210 మంది సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. నేటి నుంచి తిరుమలలోనూ దర్శనాలను కట్టడి చేశారు. ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇక శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కరోనా బారిన పడి 10 మంది సిబ్బంది చనిపోయారు. దాదాపు 70 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దర్శనాలను తగ్గించారు. సిబ్బంది కూడా రోజు విడిచి రోజు హాజరయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం దొరికింది.











