కరోనా ప్రభావం .. దేశంలోనే కాదు.. ప్రపంచం మీద కూడా చాలానే పడింది. నెలల తరబడి థియేటర్స్ మూతపడడం సినీ పరిశ్రమను తీవ్రంగా బాధించింది. ఇండియా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ మెజారిటీ థియేటర్స్ తెరవకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పట్లో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే ఆశలు అడుగంటిపోయాయి. అందుకే ఇలాంటి సిట్యువేషన్స్ ను ఓటీటీలు తమకు అనుగుణంగా మార్చుకున్నాయి. ప్రస్తుతం మరింత జోరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఇళ్ళవద్దనున్న జనానికి వినోదాన్ని అందిచండంలో బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఒరవడి.
నిన్న మొన్నటి వరకూ చిన్న సినిమాలకు మాత్రమే సౌకర్యం అనిపించిన ఓటీటీలు .. ఇప్పుడు భారీ చిత్రాలకు కూడా మంచి ప్లాట్ ఫామ్ గా మారాయి. త్వరలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ హాలీవుడ్ మూవీ కూడా చేరుతుండడంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా మరేదో కాదండీ.. ఐదు దశాద్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా సంచనాలు సృస్టిస్టోన్న జేమ్స్ బాండ్ సిరిస్ లో 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ మూవీ. డేనియల్ క్రెయిగ్ హీరోగా వస్తోన్న సినిమాను ఎప్పుడో విడుదల చేయాలనుకున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఈ నవంబర్ కు విడుదల తేదీ మారింది. అయినా సరే కుదరకపోవడంతో .. వచ్చే ఏడాది ఏప్రిల్ 2కి కొత్త డేట్ వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వచ్చింది. అదేంటంటే.. నో టైమ్ టు డై సినిమాని డిజటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారట.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయట. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయని టాక్ . ఐతే మామూలు రోజుల్లో బాండ్ సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా ఆరేడు వేల కోట్ల రూపాయలు వసూలవుతాయి. కానీ నోలన్ సినిమా ‘టెనెట్’ ఫలితం చూశాక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడటం కన్నా పెట్టుబడి మీద కొంత లాభానికి ఓటీటీకి అమ్మేయడం మేలన్న అభిప్రాయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.











