ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దేవాలయాలపై కొందరు కావాలని సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వార్తలతో రెచ్చగొట్టే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఆయన మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెచ్చరించారు. కొందరు పోలీసులకు మతం రంగు పులుముతున్నారని ఇది మంచి పద్దతి కాదని సవాంగ్ హెచ్చరించారు. దేవాలయాల ఘటనలపై చాలా కామెంట్స్, చర్చలు నడిచాయి, కానీ నిజాలను మాత్రమే మీడియా, ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన సూచించారు. అనవసరంగా పోలీసుల పై అబద్ధపు ప్రచారాలు చేయవద్దని డీజీపీ మీడియా, సోషల్ మీడియాకు విజ్ఙప్తి చేశారు.
దాడులు గతంకంటే తక్కువే
గత సంవత్సరాలలో దేవాలయాలపై జరిగిన దాడులకంటే 2020లో తక్కువ దాడులు జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. 2020లో 38 విగ్రహాల దొంగతనాలు, 2 రధాల దహనం, 4 దేవాలయాలలో తవ్వకాలు మాత్రమే జరిగాయని ఆయన గణాంకాలు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పోలీసులపై దుర్భాషలు చాలా పెరిగాయని, గతంలో పోలీసులపై ఎప్పుడూ ఇలాంటివి దుర్భాషలు వినలేదని ఆయన అన్నారు. పోలీసులు ఎప్పుడు కూడా కుల, మత, ప్రాంత, భాషా బేధాలు పట్టించుకోలేదని సవాంగ్ గుర్తుచేశారు.
చట్టం తనపని తానుచేసుకుపోతుంది
పోలీసులు చట్టబద్ధంగా పనిచేస్తారని, రాజ్యాంగ బద్ధంగా తయారయిన ఒక వ్యవస్ధ ఐపీఎస్ అని సవాంగ్ గుర్తుచేశారు. రాజ్యాంగ బద్ధమైన విధానాల ద్వారా మాత్రమే మేం పనిచేస్తున్నామన్నారు. పోలీసులపై వచ్చిన అపవాదులు ఏవీ నిజం కాదని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 58871 ప్రార్ధనా స్ధలాలని మ్యాపింగ్ చేశామని, 9392 ప్రదేశాలలో 30551 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం మొత్తం 13089 ప్రదేశాలలో 43,824 కెమెరాలు పనిచేస్తున్నాయని డీజీపీ గుర్తుచేశారు.
Must Read ;- అవినీతి కేసులో అరెస్టుచేసినందుకే.. చంద్రబాబుపై కోపమా?
రామతీర్థంలో కూడా కెమెరాలు పెట్టాం
విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయ సెక్యూరిటీ ఆడిట్ లో 16 కెమెరాలు ఉన్నాయని, రామతీర్థం దేవాలయంలో 32 కెమెరాలకు పెంచామని డీజీపీ ప్రకటించారు. రామతీర్థం గుట్టపై విద్యుత్ లేకపోవడం వల్ల కెమెరాలు పెట్టడం ఆలస్యం అయిందన్నారు. రామతీర్థంలో కెమెరాలు పెట్టడానికి ఒకరోజు ముందు గుట్టపైన ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని డీజీపీ వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనూ దేవాలయాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, సెక్యురిటీ ఆడిట్ జరగలేదని ఆయన గుర్తుచేశారు.
నిందితులను అదుపులోకి తీసుకున్నాం
దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను అరెస్టు చేశామని డీజీపీ ప్రకటించారు. 1635మంది అనుమానితులు రాష్ట్రంలో దేవాలయాలపై పాత కేసులలో ఉన్నారని తెలిపారు. 2979 మంది మతపరమైన దాడులు చేసిన అనుమానితులను ప్రశ్నించామన్నారు. గత నాలుగు నెలల్లో దేవాలయాలపై దాడులలో 335 మంది నిందితులపై 178 కేసులు కట్టి వారిని అరెస్టు చేశామని డీజీపీ వెల్లడించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మతపరమైన, వివాదాస్పద సంఘటనలు జరగకుండా చూసేలా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామాలో రక్షణ స్క్వాడ్స్ ఏర్పాటు
గ్రామీణ ప్రాంతాల్లో 15394 విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని డీజీపీ ప్రకటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ స్క్వాడ్స్ లో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, దేవాలయాల ధ్వంసంపై దర్యాప్తు చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశామని సవాంగ్ వెల్లడించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలపై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోందని డీజీపీ ప్రకటించారు.
Also Read ;- డీజీపీ ఏం జరుగుతోంది? నివేదిక కోరిన కేంద్రం