చరణ్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన ‘ఆచార్య’ సినిమాలోనూ ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం వాళ్లకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోన్న విషయం. ఆ తరువాత చరణ్ చేయనున్న సినిమాలపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరక్టర్లంతా ఆల్రెడీ ఆయనకి కథలు వినిపించేసి, తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది.

గౌతమ్ తిన్ననూరి పేరు వినగానే ‘జెర్సీ’ సినిమా గుర్తుకు వస్తుంది. నాని కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆయన ఇదే కథను షాహిద్ కపూర్ కథానాయకుడిగా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎమోషన్స్ తో కూడిన ఈ కంటెంట్ కి ప్రేక్షకులు ఇక్కడ నీరాజనాలు పట్టారు. అలాగే బాలీవుడ్ లోను సక్సెస్ కావడం ఖాయమనే నమ్మకంతో గౌతమ్ ఉన్నాడు. ఆ సినిమా తరువాత తెలుగు ప్రాజెక్టు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు.
గౌతమ్ ఈ సారి తెలుగులో పెద్ద ప్రాజెక్టు చేయాలనే పట్టుదలతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లనే ఆయన అందుకు తగినట్టుగానే భారీ బడ్జెట్ తో కూడిన కథనే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అది చరణ్ రేంజ్ కథ అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చరణ్ ను కలిసి ఆయన ఆ కథను వినిపించాడట. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కలిపి అల్లిన ఈ కథ చరణ్ కి బాగా నచ్చిందని అంటున్నారు. తప్పకుండా చేద్దామని చరణ్ నుంచి ఆన్సర్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. మరి చరణ్ ఆర్డర్లో గౌతమ్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read: అనిల్ రావిపూడిని కలిసిన రామ్ చరణ్ మేనేజర్.. ఇంతకీ విషయం ఏంటి.?











