(నల్లగొండ నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
పూర్వవైభవం కోసం నానా తంటాలు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లా రాజకీయాలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పి సి సి) పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీది ఘనమైన చరిత్ర. దానికి తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు చాలామంది ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు వచ్చినా .. నల్లగొండ జిల్లాలో మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నల్లగొండ, మిర్యాలగూడ, హుజుర్నగర్, కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో విజయం సాధించగా .. ఆ పార్టీ పొత్తుతో దేవరకొండ నుంచి పోటీ చేసిన సిపిఐ కూడా విజయం సాధించింది . ఇక రెండు లోకసభ నియోజకవర్గాల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. అంటే ఈ జిల్లాలో టిఆర్ఎస్తో సమవుజ్జీగా నిలబడింది. ఆ పార్టీ సీనియర్లైన మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పార్టీ తలరాత తిరగబడింది . కేవలం మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుని రెండు చోట్లా గెలిచింది. ఇపుడు నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీలుగా ఉన్నారు.
ఎన్నికల రాజకీయ అంశాలను పక్కన పెట్టి.. కాంగ్రెస్ సంస్థాగత రాజకీయాల విషయానికి వచ్చినా.. రాష్ట్ర కాంగ్రెస్లో జిల్లా నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఆరేళ్లుగా పీసీసీ ప్రెసిడెంట్గా నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇంతకూ… ‘పీఠం’ ఎవరిది..?
గత కొద్ది నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ సారథిని మారుస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇస్తారన్న ప్రచారం ఉంది . జిల్లాకే చెందిన మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. పోతే, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం పిసిసి పీఠం రేసులో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఇద్దరు నేతల మధ్యనే ఈ పోరు జరుగుతోంది.
ఇప్పటివరకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా… రాష్ట్ర కాంగ్రెస్ సారథిని మార్చడం అనివార్యమనే వార్తల నేపథ్యంలో ఆశావహ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు ‘మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్న వారిని కాదని మధ్యలో పార్టీ కండువా కప్పుకున్న వారికి సారథ్య బాధ్యతలు ఎలా ఇస్తారు?’ అని కొందరు సీనియర్లు కొత్త వాదన లేవనెత్తుతున్నారు. రేవంత్ రెడ్డి అవకాశాలకు చెక్ పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలోని మరికొందరు సీనియర్లకు ఈ పీఠంపై ఆశలు ఉన్నా.. ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు మాత్రమే బాగా ప్రచారంలో ఉన్నాయి
తెరపైకి .. ‘జానా’ పేరు
‘ పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న..’ చందంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ల మధ్య సాగుతున్న పిసిసి రేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది . నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్, మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. దీంతో జిల్లా కాంగ్రెస్లో దాని ప్రభావం పడింది . ఇన్నాళ్ళు నియోజకవర్గ రాజకీయానికి పరిమితమై నిశ్శబ్దంగా ఉన్న జానారెడ్డి రెడ్డి తాను పిసిసి రేసులో ఉన్నట్టు హై కమాండ్కు సంకేతాలిచ్చారు అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఏ రకంగా చూసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ల కంటే జానారెడ్డి సీనియర్ కావడంతో ఆయన అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా (ప్రధాన ప్రతిపక్ష నాయకుడు) వ్యవహరించిన అనుభవం, గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అత్యధిక శాఖలకు, అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన అనుభవం, ఇతర నాయకులతో ఉన్న సమన్వయం, సంబంధాలు ఆయన అనుకూల అంశాలుగా చెబుతున్నారు. చివరకు పీసీసీ రేసులో ముగ్గురు పేర్లు హల్ చల్ చేస్తున్నా, వారిలో ఇద్దరు నాయకులు జిల్లా వారే కావడం విశేషం. అంటే వీరిలో ఏ ఒక్కరికి అవకాశం దొరికినా మరోసారి పిసిసి సారథిగా జిల్లా నాయకుడే ఉంటాడన్న ఆశ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది
– కేపీ










