టాలీవుడ్ అగ్ర కథానాయిక, అందాల చందమామ వివాహం నిన్న ముంబై తాజ్ ప్యాలెస్ లో జరిగింది. కోరుకున్న ప్రియుడు గౌతమ్ కిచ్లూ చేత మూడుముళ్ళూ వేయించుకుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సన్నిహితులు, బంధువుల సమక్షంలో మార్వాడీ పద్ధతిలో సాంప్రదాయ బద్ధంగా అతి వైభవంగా జరిగింది పెళ్ళి. అయితే అమ్మడు పెళ్ళి తర్వాత కూడా నటనను కొనసాగిస్తానని తన అభిమానులకు మాటిచ్చింది.
ఇప్పటికే ‘లైవ్ టెలీకాస్ట్’ అనే వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేసిన కాజల్.. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’లోనూ, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ మూవీలోనూ నటిస్తోంది. వీటితో పాటు కమల్ శంకర్ ‘భారతీయుడు 2’ లోనూ నటిస్తోంది. వీటిలో ‘ఆచార్య’ మూవీ నవంబర్ మొదటి వారంలో తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. దాదాపు 45రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో మేజర్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ పెళ్ళి అయినా సరే.. ‘ఆచార్య’ షూట్ లో పాల్గొనబోతోందనే వార్తలొస్తున్నాయి.
అయితే పెళ్ళయిన తర్వాత కాజల్ తన భర్తతో కొద్ది రోజులైనా గడపకుండా ‘ఆచార్య’ సినిమా షూట్ లో పాల్గొంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పెళ్లయ్యాకా నవదంపతులకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇలా పెళ్ళి అయిపోగానే.. ఎవరి పనుల్లోకి వారు వెళ్ళడం సాధ్యం కాకపోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా హానీమూన్ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఇరు కుటుంబాల పెద్దలు కూడా కొత్త జంట ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో చందమామ రెండు వారాల్లో ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనడం సాధ్యమయ్యే పనేనా అని చర్చించుకుంటున్నారు సినీజనం. మరి కాజల్ .. వైవాహిక జీవితానికి ప్రాముఖ్యతనిస్తుందో లేక.. ప్రొఫెషనలిజానికే కట్టుబడి ఉంటుందో చూడాలి.