ఎమ్మెల్యేకు ప్రధాన్యతవ్వకుంటే.. మంత్రి కాలుపెట్టనివ్వం..!
కర్నూలు జిల్లా నందికొట్టూరులో ఆదిపత్య పోరు, వర్గ విభేదాలు అధికార పార్టీ నేతల మధ్య గ్యాప్ ను పెంచుతున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ దూరం ఉన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మిడుతూరు మండలంలోని నాగలూటిలో ఉపాధి పథకం కింద రూ. 1.10 కోట్లతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే, ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్ర భవనాలను, సీసీ రోడ్లను మంత్రి అనిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొనకపోవడం విశేషం. సొంత నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలకు వస్తే.. ఎమ్మెల్యే హాజరుకాకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నందికొట్కూరు నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వబోమని గతంలో ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించడం గమనార్హం!
నేతల మధ్య వివాదాలకు దారితీస్తున్న గ్యాప్స్..!
సిద్ధార్థ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య పచ్చగడ్డెస్తే భగ్గుమంటుంది. అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుని పార్టీ పెద్దలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నియోజకవర్గం పరిధిలోని పగిడ్యాలలో 1,2 సచివాలయాల భవనాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. వీటికి కూడా ఎమ్మెల్యే ఆర్థర్ హాజరుకాలేదు. మంత్రి పర్యటన మొత్తాన్ని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాత్రం ముందుండి నడిపించారు. అయితే మంత్రి పర్యటన సందర్భంగా బైరెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో ఎక్కడ ముద్రించలేదు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఇలా నేతల మధ్య గ్యాప్ కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు పెదవి విరుపస్తున్నారు. తాగునీటి సమస్యలపై నేరుగా మంత్రి అనిల్ కాన్వాయిని అడ్డుకుని మరి అడిగే పరిస్థితికి వచ్చారు. అంతేకాక అధికార పార్టీలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకులు మధ్య వ్యక్తి విభేదాలు అప్పుడప్పుడు పొడ చూపుతూనే ఉన్నాయి.