ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ACB కోర్టు అనుమతించింది. తదుపరి అనుసరించాల్సిన ప్రక్రియ కోసం జిల్లా కలెక్టర్కు సిఫారసు చేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న రూ. వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం – PMLA కింద అభియోగాలు మోపింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు – ECIR నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో అతని వాంగ్మూలం నమోదు కోసం ED ACB కోర్టును ఆశ్రయించింది.
రాజ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి జైల్లో ఉన్నారు. రాజ్ కెసిరెడ్డిని ముందు పెట్టి సూత్రధారులు స్కామ్ ను నడిపించారు. వేల కోట్లు దోచుకున్నారు. ఏపీ లిక్కర్ స్కాంలో అసలు కేసు అంతా ఈడీలోనే ఉండే అవకాశం ఉంది. వేల కోట్లు దోపిడీ చేయడమే కాకుండా.. వాటిని వైట్ గా మార్చేందుకు వివిధ రకాల పద్దతుల్లో హవాలా చేశారు. ఈ హవాలా వ్యవహారంలో ఉన్న తీగలన్నీ దొరికాయని భావిస్తున్నారు. బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఈడీ పూర్తి స్థాయిలో దూకుడు చూపిస్తే ..చాలా మంది జైలుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.











