ఏపీలో అధికార వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు రెవెన్యూ పరిధిలో 404 ఎకరాల కొండపోరంబోకు భూమిని కొందరు వైసీపీ నేతలు కబ్జా చేశారు. చందలూరు రెవెన్యూ 787 సర్వే నెంబరులో మొత్తం 804 ఎకరాలు ఉంది. ఇందులో 400 ఎకరాల్లో కొండ ఉంది. దాని చుట్టుపక్కల మరో 404 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. దీనిపై ఎప్పటి నుంచో కన్నేసిన పెద్దలు ఇప్పటికే 50 ఎకరాలకు డీకే పట్టాలు పుట్టించారు. అందులో టాక్టర్లతో దున్నడం ప్రారంభించారు. గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, దర్శి తహశీల్దార్ అటవీ భూమిని పరిశీలించి కబ్జాను నిలువరించారు.
ఏంది సామీ అడవులు కూడా వదలరా?
దర్శి మండలం చందలూరు అటవీ భూముల కబ్జా వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. అటవీ భూమి కబ్జా విషయంలోనే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత బూచేపల్లికి వివాదాలు మొదలయ్యానే టాక్ వినిపిస్తోంది. 404 ఎకరాలు కాజేసేందుకు ముందుగానే రికార్డులు కూడా తారుమారు చేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే 50 ఎకరాలకు డీకే పట్టా కూడా పుట్టించారు. పోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వడం సాధ్యంకాదు. కానీ రెవెన్యూ అధికారులు డీకే పట్టాలు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తమకు భూమిపై హక్కులు ఉన్నాయని కబ్జారాయుళ్లు గట్టిగా చెబుతున్నారు. దర్శి ఎమ్మార్వోకు కూడా అదే విషయం చెప్పారు. తమశీల్డార్ అటవీ భూమిని పరిశీలించిన అనంతరం, కార్యాలయానికి వచ్చి హక్కు పత్రాలు చూపాలనడంతో అనేక అనుమానాలు వస్తున్నాయని చందలూరు గ్రామస్థులు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియకుండానే ఈ తంతు మొత్తం సాగిందా? అని చందలూరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లంచం ఇస్తే ఏదైనా రాసిస్తారా?
అటవీ పోరంబోకు భూములకు పట్టాలు పుట్టించేందుకు వైసీపీలో పెద్ద నేతలే చక్రం తిప్పారని తెలుస్తోంది. 404 ఎకరాల పోరంబోకు భూమిని కాజేసేందుకు ముందుగానే రికార్డులు తారుమారు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. ముందే రికార్డులు మార్చి, రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం జిల్లా స్థాయిలోని ఓ రెవెన్యూ అధికారి చక్కబెట్టారని సమాచారం. అధికారులకు, అధికారపార్టీ నేతలు తోడైతే ఎదైనా కబ్జా చేసేందుకు సాధ్యమని చందలూరు అటవీ భూముల వ్యవహారమే నిదర్శనంగా నిలుస్తోంది.











