ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ‘వివో’ కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. 2018 నుంచి 2022 మధ్య కాలానికి ఐపీఎల్ లీగ్ తో బీసీసీఐ ఒప్పందం చేసుకొంది. ఈ ఐదేళ్ల కాలానికి వివో కంపెనీ బీసీసీఐకి రూ.2190 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కానీ వివో స్పాన్సర్షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగడంతో బీసీసీఐ నష్టాలలో చిక్కుకుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్-2020 స్పాన్సర్షిప్ నుంచి ‘వివో’ వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.
బీసీసీఐ బలమైన బోర్డని చెప్పిన దాదా ఇటువంటి పరిస్థితులను ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ సమస్యను అధిగమిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. గొప్ప పనులు వెంటనే జరగవని కొంత కాలం పడుతుందని వేచి చూడాలని హితబోధ చేశారు. ఇదే సమయంలో బీసీసీఐ గత పాలకులు, భారత క్రికెట్ ఆటగాళ్లు బీసీసీఐని బలంగా తీర్చిదిద్దారని ఎటువంటి కంగారు అవసరం లేదని పేర్కొన్నాడు. వీవో స్థానంలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, బైజూస్, కోకాకోలా కంపనీలు స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడుతున్నాయి. తాజాగా బాబా రాందేవ్కు చెందిన పంతంజలి సంస్థ కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి ఎల్కే తిజరవాల ధృవీకరించాడు. తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు పంతంజలి సంస్థ రంగంలోకి దిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.