విజయవాడ కార్పొరేషన్లో ‘చెత్త పన్ను’ వివాదాస్పదంగా మారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా చెత్త పన్ను వసూలు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దీంతో ఒక్క విజయవాడ నగరంలోనే రూ.600 కోట్లు చెత్త పన్ను ద్వారా వసూలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతిపక్షాలతోపాటు, అధికార పక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇప్పటికే ఇంటిపన్ను, మురుగునీటి పన్ను, తాగునీటి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నులో భాగంగానే చెత్త పన్ను కూడా కలిపే ఉంటుంది. సేవా పన్నులోనూ కార్పొరేషన్ అధికారులు చెత్త పన్ను కలిపే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా చెత్త పన్ను వేస్తే ప్రజలు తిరగబడతారిని అధికార పార్టీకి చెందిన ఓ నేత అధికారులను గట్టిగా నిలదీశారట. దీంతో చెత్త పన్ను వేయాలా? వద్దా అనేది కార్పొరేషన్ అధికారులు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
చెత్త నుంచి తైలం పిండవచ్చు…
తడి పొడి చెత్త కలిపి ఇచ్చిన ఇంటి నుంచి నెలకు రూ.100, తడి, పొడి చెత్తలను వేరు వేరుగా ఇస్తే రూ.50 వసూలు చేయాలని తాజాగా అధికారులు ప్లాన్ తయారు చేశారు. అయితే ఇది ఎంత వరకు అమలు సాధ్యమో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్లో అనేక పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రతి దానికి ఓ పన్ను విధిస్తూ, తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారని కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు బాబూరావు మండిపడ్డారు. చెత్త పన్ను ఆలోచనను విరమించుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది గమనించిన అధికారపార్టీ వారు, ఇలాంటి పన్ను వసూలు యోచన విరమించుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
కార్పొరేషన్ ఎన్నికల తరవాత చెత్తపన్ను బాధుడు తప్పదా?
కరోనా తగ్గితే ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు చెత్త పన్ను వేస్తే, ఇక గెలవడం కష్టం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి ప్రస్తుతానికి చెత్త పన్ను ఆలోచన విరమించేలా చేయాలని చూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ వ్యవహారం తేలనుంది.
ఇప్పటికే అనేక పన్నుల బాదుడు
విజయవాడలోని 260 కాలనీ సంఘాల నుంచి ఇప్పటికే భారీగా పిండుతున్నారు. ఆయా కాలనీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాల్లో సగం జీతం కాలనీ సంఘాల నుంచి వసూలు చేస్తున్నారు. మరలా వారిపై చెత్త పన్ను భారం వేస్తే ప్రజల్లో వ్యతిరేకత తప్పదని వైసీపీ భావిస్తోంది. అందుకే కార్పొరేషన్ ఎన్నికల అనంతరం కాలనీ వాసులను వదిలేసి, మిగిలిన ప్రాంతాల్లో చెత్తపన్ను అమలు చేయాలనే యోచనలో సిటీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు అధికార వైసీపీ నేతల ఒత్తిడి నుంచి బయట పడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ చెత్తపన్ను విధింపు ఆపాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.