కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడంతోపాటు ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అటు సొంత పార్టీలో..ఇటు బయటి పార్టీల్లో ఆయనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి పేరు వింటేనే..కరడుగట్టిన టీఆర్ఎస్ వాళ్లకి కోపం రావడం కామన్ గా కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. ఆయన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ తోనే జరిగినా.. తరువాత బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. అక్కడినుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎదిగారు. గతంలో టీడీపీలో ఉన్న సమయం నుంచి టీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోరు నడుస్తూనే ఉంది. ఇక 2018 ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా కొడంగల్ లో ఓడారు. దీంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి.. ఏకంగా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన.. మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగారు. హోరాహోరీ పోరులోనూ విజయం సాధించారు. ఆ విజయానికి కారణాలు చాలా ఉన్నాయి. టీడీపీ ఓట్లు, నాన్ లోకల్ ఓట్లు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు, టీఆర్ఎస్ లోని రేవంత్ అభిమానుల ఓట్లు, ప్రశ్నించేవారిని గెలిపించాలని కోరుకున్న వారు..ఇలా చాలా రీజన్స్ ను రాజకీయ విశ్లేషకులు తెరపైకి తెచ్చారు.
అదంతా ఒక ఎత్తైతే.. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరో ఎత్తుగా కనిపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ ..కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీపీసీసీ రేసులో కోమటిరెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మాజీ పీసీసీ పొన్నాల..ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. పీసీసీ చీఫ్ ఎవరనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే అయినా.. కేసీఆర్ ను ఢీకొట్టేవారే పీసీసీ చీఫ్ కావాలని మరికొందరు నాయకులు చెబుతున్నారు.
ఇక రేవంత్ విషయానికి వస్తే.. మల్కాజ్గిరిలో గెలిచాక.. టీఆర్ఎస్ పై మరింత చెలరేగిపోతున్నారు రేవంత్. జీవో నెంబరు 11ని అతిక్రమించి జన్వాడలో ఓ నిర్మాణం ఉందని, అది కేటీఆర్ దేనని గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్లారు రేవంత్. మొన్న వరద పరిహారం విషయంలో కూడా ఆందోళన చేపట్టారు. ఇవన్నీ కచ్చితంగా రేవంత్ మైలేజ్ పెంచేవే. అయితే ప్రజల మనసులో నాయకులకు ఎంత ఇమేజ్ ఉన్నా.. అది నిరూపణ కావాలంటే.. ఓట్లు రాబట్టుకోవడం ఒక్కటే మార్గం. రేవంత్ కి కూడా ఇప్పుడే అదే పరీక్ష ఎదురైంది.
రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 47 డివిజన్లు ఉన్నాయి. అందులో మొత్తం టీఆర్ఎస్ వారే ఉన్నారు. అంటే సిట్టింగ్ కార్పొరేటర్లంతా టీఆర్ఎస్ వాళ్లే. ఈ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ వారే. అంటే ఎంపీ అభ్యర్థిగా ఏవిధంగా అయితే.. ప్రజలను ఆకర్షించగలిగారో.. అదే విధంగా ఇప్పుడు రేవంత్ తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలి. అందులో భాగంగానే..కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న 47 డివిజన్లలో కనీసం సగమైనా గెలిస్తే తప్ప.. పార్టీలో పట్టు పెరిగే అవకాశం లేదు.
ఈ విషయంపై ఆయన అనుచరుల్లో మరో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన టీడీపీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 94 స్థానాలో పోటీచేసింది. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న 47 డివిజన్లకు గాను..34చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుపై రేవంత్ ఆశపెట్టుకున్నారు. తనను గెలిపించిన టీడీపీ కేడర్, తటస్థ ఓటర్లు, కంటోన్మెంట్ ప్రభావిత పరిధిలోని ఓటర్లు, కాంగ్రెస్ కేడర్, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణేతరుల ఓట్లను ఇప్పటికే గాలం వేశారు. ఆయా కాలనీల్లోని ముఖ్యులతో, సామాజిక వర్గాలపెద్దలతో, అసోసియేషన్లలో రేవంత్ అండ్ కో ఇప్పటికే భేటీలు జరిగింది. ఎలాగైనాసరే.. ఈ సారి కేసీఆర్ కళ్లు తెరిపించాలనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే యత్నం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కనీసం సగం స్థానాలైనా గెలవకుంటే.. లేదా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేదంటే.. రేవంత్ కి ప్రత్యక్షంగా నష్టం ఉండకపోవచ్చు..కాని ఇమేజ్ తగ్గుతుందని చెప్పవచ్చు. పరోక్షంగా అది TPCCపైనా పడుతుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. రేవంత్ పై అధిష్టానాననికి లేఖలు రాసేవారికి మాత్రం మరో ఆయుధం దొరకుతుందని చెప్పవచ్చు. రేవంత్ ఇమేజ్ చాలా పరిమితమని ఆ లేఖల్లో పేర్కొనవచ్చు.











