చిరుద్యోగి స్థాయినుంచి తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ స్థాయికి వచ్చిన స్వామి గౌడ్.. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. అదే టైంలో ఇతర పార్టీల నాయకులు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కలుస్తున్నారు. శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా స్వామి గౌడ్ ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. స్వామిగౌడ్ బీజేపీలో చేరతారని వార్తలూ వచ్చాయి. అయిదే ఆ వార్తలను స్వామిగౌడ్ ఖండించారు. మొత్తంమీద స్వామిగౌడ్ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన కనకమామిడి స్వామిగౌడ్ తొలుత రాజేంద్రనగర్ పంచాయతీ (అప్పట్లో అది పంచాయతీగా ఉండేది) లో ఉద్యోగిగా చేరారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. అప్పట్లో ఆ ఉద్యమంలో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో స్వామిగౌడ్ బుల్లెట్ గాయానికి గురయ్యారు. అయితే ఆ ఉద్యమం అప్పట్లో కాస్త చల్లారింది. 1977లో దివిసీమ ఉప్పెన టైంలో స్వామిగౌడ్ తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమం ఉద్యమమే కాని ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా పౌరుడిగా బాధ్యత అని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి. తరువాతి కాలంలో మలిదశ ఉద్యమంలో TNGO నాయకుడిగా, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించారు. 42రోజుల పాటు జరిగిన సకలజనుల సమ్మెను ముందుండి నడిపించిన వారిలో స్వామిగౌడ్ కూడా ఒకరు. 2012లో రిటైర్ అయ్యారు. అనంతరం TRSలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. ఆ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కే టీఆర్ఎస్ కేటాయించింది. తరువాత కొన్నాళ్లకు స్వామిగౌడ్ పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉండడం ప్రారంభించారు.
2019 నుంచి ఆయన వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2020లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన నారాయణగురు జయంతి వేడుకలకు హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొన్ని కులాలే అధికారం చలాయిస్తున్నాయని, అణగారిన కులాలకు, వెనుకబడిన కులాలకు ప్రాధాన్యం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. తరువాత బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ , రేవంత్ రెడ్డి పరస్పరం పొగుడుకున్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రేవంత్రెడ్డి బలమైన వెన్నుపూసగా మారారని, వెనుకబడిన వర్గాలకు రేవంత్ చేతికర్రగా మారారని కామెంట్ చేశారు. ఎన్నికల్లో 2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడుతుంటే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ పోటీకి నిలబెడుతోంది. ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే.. మరో పార్టీ 15మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోంది. ఇలాంటి రాజకీయాలు పోవాలి, తెల్లబట్టల నేతలకు అమ్ముడుపోయి మోసపోవద్దు అని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వామిగౌడ్ ని అన్న అని సంబోధించారు. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ అన్న పాత్ర మర్చిపోలేదని, తెలంగాణ ఉద్యమంలో ఆయనపై దాడి చేసినా.. పెద్ద మనసులో ఆ అధికారులకు కూడా కీలకబాధ్యతలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల బిడ్డగా గుర్తింపు పొందిన స్వామిగౌడ్ ను టీఆర్ఎస్ పార్టీ పక్కనబెట్టిందని వ్యాఖ్యానించడం అప్పట్లో వైరల్ అయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఆ సామాజిక వర్గ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోపాటు మరికొందరు ముఖ్యులు భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా స్వామిగౌడ్ ఇంటికి వెళ్లారు. ఈ భేటీ సాధారణమే అని చెబుతున్నా.. స్వామిగౌడ్ ని బీజేపీలోకి లాగేందుకు ఈ ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు స్వామిగౌడ్ తమ పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. అదే జరిగితే.. రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చు.











