అమరావతి రాజధానిపై హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. 3 రాజధానుల నిర్ణయంతో జరిగిన ఆర్ధిక నష్టం వివరాలు కోరుతూ రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఆర్ధిక, గణాంకాల శాఖకు నోటీసులు జారీచేసింది. మరికొన్ని కీలక పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనుంది. అమరావతి రాజధానికి సంబంధించిన కేసులో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను కూడా హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్కు నోటీసులు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై… నివేదిక సమర్పించేలా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ని ఆదేశించాలని కోరుతూ.. రాజధాని రైతు ఇడుపులపాటి రాంబాబు, మరికొందరు రైతులు అనుబంధ పిటిషన్ వేశారు. రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన కేసుల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది.
సీఎం క్యాంప్ కార్యాలయం సహా పలు ఇతర అంశాలపై గురువారం విచారణ జరపాల్సి ఉండగా.. వాటిని కూడా ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
అమరావతిలో ఎంత ఖర్చు చేశారు?
టీడీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి రాజధాని అభివృద్దికి రూ.9,600 కోట్లు ఖర్చు చేశామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గణాంకాలతో సహా గతంలో ప్రకటించారు. మరో రూ.46,000 కోట్ల పనులు చేయడానికి టెండర్లు కూడా ఫైనల్ చేశారు. కొన్ని కంపెనీలు పనులు కూడా ప్రారంభించాయి. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని న్యాయనిపుణులు వాదించారు. అయితే గత ప్రభుత్వం చెప్పినంత ఖర్చు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారని తెలుస్తోంది.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం అమరావతిపై ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారనే పూర్తి గణాంకాలు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకున పడిండి. ఇప్పటి వరకూ అమరావతిలో చంద్రబాబునాయుడు ఖర్చు పెట్టింది పెద్దగా ఏమీ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. హైకోర్టు లెక్కలు అడగడంతో ఇక అమరావతితో ఎంత ఖర్చు చేసిందీ అధికారికంగా తేలనుంది. వేల కోట్లు ఇప్పటికే ఖర్చయింది. అమరావతితో పాటు మరో 2 రాజధానులు అంటే వాటికీ కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పైగా ఇప్పటిదాకా ఇక్కడ ఖర్చు పెట్టిన సొమ్ము ఏమవుతుందనే ప్రశ్న కూడా వస్తుంది. సగంలో ఉన్న నిర్మాణాల సంగతేంటనే చర్చ కూడా వస్తుంది. ఇలాంటి చర్చ అధికారికంగా గణాంకాల ఆధారంగా జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన పరిణామమే అనే వాదన వినిపిస్తోంది.
గణాంకాలు కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అఫీషియల్ గా అమరావతిపై ఎంత ఖర్చయిందీ, అధికార వికేంద్రీకరణ కోసం కోర్టు పిటిషన్ల రూపేణా.. న్యాయవాదులకు ఎంత ఖర్చుచేశారో కూడా తేలనుంది.











