అసలే కరోనా కష్టాలు ఎప్పుడు కడతేరుతాయా అని ప్రభుత్వం, ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సరికొత్త జబ్బులు కూడా విజృంభించి ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. మొన్నటికి మొన్న ఏలూరు వ్యాధి ఎలా వచ్చిందో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, నిన్న చూస్తే ‘మ్యుకోర్మికోసిస్’ అనే ఫంగస్ ఏకంగా 9 మందిని బలితీసుకోవడంతో దేశంలో పలు నగరాలకు వ్యాపించింది. నేడు కేరళలో మరో బ్యాక్టీరియా కలకలం రేపుతోంది.
11 ఏళ్ల బాలుడి మృతి
సూడాన్ నుంచి వచ్చిన ఓ సైనికుడిలో ప్లాస్మోడియం ఒవెల్ అనే కొత్త రకం మలేరియా వంటి వ్యాధిని గుర్తించారు వైద్యులు. ఇది బ్యాక్టీరియా కుటుంబానికి చెందినదని, దీని పేరు ‘షిగెల్లా’ అని పేర్కోంటున్నారు వైద్యులు. ఇది అంటువ్యాధి కావడంతో గుర్తించే సమయంలోనే నష్టం జరిగిపోయింది. సైనికుడి నుండి వ్యాపించిన ఈ వ్యాధి ఓ 11 ఏళ్ల బాలుడిని బలితీసుకుంది. కోజికోడ్ కి చెందిన ఈ బాలుడు ఈ బ్యాక్టీరియా వల్ల ప్రాణాలు కోల్పోవడంతో.. ఈ చిన్నారితో సన్నిహితంగా ఉన్న స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు పలువురు అస్వస్ధత పాలైనట్లు సమాచారం అందింది.
షిగెల్లా లక్షణాలు
కడుపులో తిప్పడం, జ్వరం, అతిసారం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా డాక్టర్లు చెప్తున్నారు. కోజికోడ్ ప్రాంతంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు మెడికల్ టీమ్ తెలియజేసింది. నీరు, ఆహారం ద్వారా త్వరితగతిన వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడం వల్ల వ్యక్తిగత శుభ్రతతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నీటిని, ఆహారాన్ని తినవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలుడు మరణించిన ప్రాంతంలో ఆహారంకి సంబంధించిన తనిఖీలు, నీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రపరచడం లాంటి కార్యక్రమాలని యుద్దప్రాతిపతికన పూర్తిచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.











