ఎంతమంది సినిమా రంగంలో అడుగుపెట్టినా సినిమా రంగం అక్కున చేర్చుకుంటుంది. కాకపోతే వారిలో ప్రతిభాపాటవాలు ఉండాలంతే. దీనికి ‘నెపోటిజం’ అని పేరు పెట్టేవారు కూడా లేకపోలేదు. టాలెంట్ తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉంటే తెర మీద వెలిగిపోవడం ఖాయమేననవచ్చు. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడున్న హీరోలకు తోడు మరికొందరు రంగ ప్రవేశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలా ఎవరెవరు హీరోలుగా అడుగుపెట్టబోతున్నారో చూద్దాం.
మహేష్ మేనల్లుడు
సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మహేష్ రిలీజ్ చేశాడు.

బాలయ్య కుమారుడు
నందమూరి తారకరామారావు మనవడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు. త్వరలోనే ఆదిత్య 369 కి సీక్వెల్ తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆదిత్య 999 టైటిల్ తో తెరకెక్కనున్న ఆ సీక్వెల్ ను తనే డైరెక్ట్ చేస్తానని ఆ సినిమాతో తన వారసుడు మోక్షజ్ఞ ని నటుడిగా పరిచయం చేయబోతున్నానని చెప్పుకున్నాడు బాలయ్య. ఆదిత్య 369 సీక్వెల్ లో బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ హీరోలు. కానీ సినిమాలో తండ్రికొడుకులుగా మాత్రం కనిపించరు. అలా ఓవర్ నైట్ లో సీక్వెల్ కు కథ సిద్ధం చేశారు బాలయ్య.

ఎన్టీఆర్ బావమరిది
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈయన స్వయానా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు. ప్రముఖ వ్యాపారవేత్త, జూనియర్ ఎన్టీఆర్కు మామ నార్నే శ్రీనివాస రావు కుమారుడు. కొన్ని నెలలుగా నితిన్ చంద్రను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో నితిన్ చంద్రను హీరోగా పరిచయం చేయాలనుకున్నప్పటికీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిది లాంఛ్ కోసం ఓ కథ విన్నాడని.. అది బాగా నచ్చడంతో ఫైనల్ చేకినట్లు తెలుస్తుంది.
బెల్లంకొండ చిన్న కుమారుడు
టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్, తన పెద్ద కొడుకు బెల్లకొండ సాయిశ్రీనివాస్ ను గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు బెల్లంకొండ తమ్ముడు గణేష్ బాబు కూడా హీరోగా రాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ పాటికే గణేష్ హీరోగా ఓ సినిమా రావాల్సింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అలా సితార బ్యానర్ పై డెబ్యూ ఇస్తున్నాడు గణేష్ బాబు.
సతీష్ వేగేశ్న కుమారుడు
శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడీ దర్శకుడు తన తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతడి పేరు సమీర్ వేగేశ్న. తన స్వీయ దర్శకత్వంలో కోతికొమ్మచ్చి అనే సినిమాతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఇందులో శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి కూడా హీరోగా నటిస్తున్నాడు. సినిమా ఇప్పటికే రెడీ అయింది. త్వరలోనే సమీర్ వేగేశ్న వెండితెరపైకి రాబోతున్నాడు.
అల్లు అర్జున్ బావమరిది
బన్నీ బావమరిది కూడా హీరోగా పరిచయమౌతున్నాడు. అతడి పేరు విరాన్ ముత్తంశెట్టి. విరాన్ ముత్తంశెట్టి
హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ ను బన్నీ స్టార్ట్ చేయబోతున్నాడు.
రానా తమ్ముడు అభిరామ్
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుండి వెంకటేష్ ఆ తర్వాత రానా హీరోలుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు.
నిజానికి దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ సినిమా గురించి ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. గతంలో వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకు కూడా అభిరామ్ పేరు వినిపించింది. కట్ చేస్తే ఆ సినిమాను సుమంత్ ని పెట్టి తీశారు. ఆ తర్వాత కూడా అభిరామ్ తొలి సినిమా గురించి వివిధ దర్శకులతో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో రాబోతున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు.
దిల్ రాజు తమ్ముడి కొడుకు
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నిర్మాతలు దిల్రాజు, శిరీష్. వీరి ఫ్యామిలీ నుంచి ఓ హీరో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..దిల్రాజుగారి సోదరుడు.. నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. కాలేజీ కుర్రాళ్లు, కాలేజీ జీవితం ఎలా ఉంటుందనే విషయాల బ్యాక్డ్రాప్తో ‘రౌడీ బాయ్స్’ తెరకెక్కింది. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఆశిష్ బి.టెక్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నాడు.











