చిరంజీవి మేనల్లుడు .. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృతి శెట్టి కథానాయికగా పరిచయం కానుంది. లవర్స్ డే కానుకగా ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్స్ కారణంగా వైష్ణవ్ తేజ్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు.
‘ఉప్పెన’ కథ నాకు బాగా నచ్చింది .. మా మావయ్యకి చెబితే ఆయన కూడా బాగుందన్నారు. ఈ కథను చేస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. మావయ్య మాట కొండంత బలాన్నిచ్చింది .. దాంతో ఇక ఆలోచించకుండా రంగంలోకి దిగిపోయాను. ఈ సినిమాలో నేను ‘జాలరి’ పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్రకి తగిన బాడీ లాంగ్వేజ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇక విజయ్ సేతుపతి వంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ తో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన వ్యక్తిత్వం నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం కలిగింది.
నేను ఎన్టీఆర్ ను తొలిసారిగా కలిసినప్పుడు ఆయన నన్ను చాలా ఆప్యాయ్యంగా పలకరించారు. ‘ఉప్పెన’ గురించి చెప్పిన విషయాలను ఎంతో ఓపికతో విన్నారు. అప్పటి నుంచి సినిమా ఎంతవరకూ వచ్చిందని నన్ను అడిగేవారు. ఈ సినిమా షూటింగు విశేషాలను గురించి కనుక్కునేవారు. నా భవిష్యత్తు ఆలోచనల గురించి అడిగేవారు. నటనపట్ల నాకు గల ఆసక్తిని గురించి తెలుసుకుని వెన్నుతట్టేవారు. నేను ఎప్పటికీ ఆయనను మరిచిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు.