మాజీ ముఖ్యమంత్రి మనసులోమాట పుస్తకంలో వ్యవసాయం దండగ అన్నారని మండలిలో మంత్రులు అనిల్ యాదవ్, బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్, నారా లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మనసులో మాట పుస్తకం మీరు తీసుకురాలేకపోయారు కనుకనే మేము తీసుకువచ్చామని, అందులో ఎక్కడా వ్యవసాయదండగ అని అనలేదని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సభ దృష్టికి తీసుకువచ్చారు. మనసులోమాట పుస్తకంలోని మాటలను టీడీపీ సభ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ చదివి వినిపించారు.
గోబెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో వ్యవసాయరంగం ఎలా అభివృద్ధి సాధించిందో మనసులోమాట పుస్తకంలో వివరించారు. దాన్ని వక్రీకరించి చంద్రబాబునాయుడు మనసులోమాట పుస్తకంలో వ్యవసాయం దండగ అన్నాడంటూ వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ధ్వజమెత్తారు. ట్రాక్టర్లు, యంత్రాల వినియోగంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని ఆ పుస్తకంలో పొందుపరిచారు. గోదావరి డెల్టాల్లో ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా నీరివ్వడం వల్ల ఎకరాకు పది సంచుల ధాన్యం దిగుబడి పెరిగిందని మనసులోమాట పుస్తకంలో వివరించినట్టు లోకేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఒక అబద్ధం వందసార్లు చెబితే నిజం అవుతుందా?
చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అని మనసులో మాట పుస్తకంలో రాశారని మంత్రులు చెబుతున్నారు. ఆ పుస్తకం తీసుకువచ్చి అందరికీ చూపించాల్సిన బాధ్యత వారిపై లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాకు ఆ పుస్తకం దొరకడం లేదు. మీ వద్ద ఉంటే తీసుకు వచ్చి చూపించండి అని బురద చల్లేస్తే, జనం నమ్ముతారని వైసీపీ మంత్రులు అభిప్రాయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంధ్రప్రసాద్ సభలో వెల్లడించారు. పుస్తకం మేం తీసుకు వచ్చాం. వ్యవసాయం దండగ అని ఎక్కడుందో చూపండి. చూపించలేకపోతే మీరు రాజీనామా చేయండి. ఆ పదాలు చూపిస్తే మేం రాజీనామా చేస్తామని రాజేంధ్రప్రసాద్ సవాల్ విసిరారు. టీడీపీ సభ్యులు ఏకంగా పుస్తకం తీసుకురావడంతో మంత్రి అనిల్ యాదవ్ కు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ సభ్యులను రెచ్చేగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నాడని, మంత్రి అనిల్ యాదవ్ చెవిలో జగన్ రెడ్డి చెప్పాడా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
మనసులోమాట ఏం చెబుతోంది?
మనసులోమాట పుస్తకంలో చంద్రబాబునాయుడు పాలనలో వివిధ రంగాలు ఎలా అభివృద్దిలో దూసుకెళుతున్నాయో వివరించారు. అలాగే వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిని మనసులోమాట పుస్తకంలో కొనియాడారు. వ్యవసాయరంగం ఇంకా అభివృద్ధి సాధించాలని మనసులోమాట పుస్తకంలో స్పష్టంగా ఉంది. అయితే చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నాడనే ప్రచారాన్ని నిజమా అన్న విధంగా నాడు వైఎస్, నేడు జగన్ గోబెల్ ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది.











