ఐటీ రంగంలో ఏపీని టాప్ పొజిషన్లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99 పైసలకే కేటాయిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు మరో రెండు కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. దేశంలో నెంబర్ 2 ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్, ప్రపంచంలోనే టాప్ 3 ర్యాంక్లో ఉన్న సాఫ్ట్వేర్ సేవల సంస్థ యాక్సెంచర్ ఏపీలో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి.
విశాఖ పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఇతర కంపెనీలకు ఇచ్చిన రాయితీలనే ఈ సంస్థలకు ఇవ్వనున్నారు. ఐటీ, ఫార్మాతో సహా మెజారిటీ పరిశ్రమలు తెలంగాణలో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్తో పాటు సేవల రంగంలోనూ వెనుకబడింది. ఈ లోటును తీర్చడానికి ఒకవైపు ఐటీ సంస్థలను తీసుకొస్తూనే మరో వైపు స్టీల్ ప్లాంట్, అల్యూమినియం కర్మాగాలు, కార్లు, బైకులు, విమానాల విడి భాగాల తయారు చేసే భారీ పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం.
ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులకు తోడు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు జరుగుతున్న వలసలు తగ్గి.. రివర్స్తో పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వలసలు పెరుగుతాయి











