పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి స్వీప్-ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనూ టిడిపి ఘనవిజయం.
ఎప్పుడెప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదామా..? ఎదురెదురు చూస్తున్న 3 ప్రాంతాల జనం..
గత 4 ఏళ్ల సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపిలో వైసిపి రౌడీల భూకబ్జాలు, వేధింపులు-బెదిరింపులు, దోపిడీ-దౌర్జన్యాలు, హింసా విధ్వంసాలతో జనం విసిగిపోయారు. ఎప్పుడెప్పుడీ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ఎదురెదురు చూస్తున్నారు.
మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లోనే అది రుజువైంది.. నిన్న జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెలే తిరగబడ్డారు, వైసిపిలో ముసలం బైటపడింది, 151ఎమ్మెల్యేలున్న వైసిపి నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్ధులకన్నా ఒక ఓటు ఎక్కువతోనే(23) టిడిపి అభ్యర్ధి అనురాధ ఘన విజయం సాధించింది.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆషామాషీ కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 108నియోజకవర్గాల్లో దాదాపు 10లక్షల కుటుంబాల తీర్పది.. ఈ ఎన్నికలో మొత్తం 3స్థానాల్లో తెలుగుదేశం పార్టీయే ఘనవిజయం సాధించడం 3ప్రాంతాల ప్రజల్లో మార్పుకు సంకేతం.
విశాఖ పరిపాలన రాజధాని అని, కర్నూలు న్యాయరాజధాని అంటూ సీఎం జగన్ రెడ్డి 3ముక్కలాటను ఆయా ప్రాంత ప్రజలే నిర్ద్యంద్వంగా తిరస్కరించారు, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని గెలిపించారు.
ఉత్తరాంధ్రలో తెదేపాకు వైకాపా కన్నా 14.39% ఆధిక్యం లభించడం విశేషం. విశాఖ పరిపాలనా రాజధానికి టిడిపి అడ్డుపడుతోందని ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా అక్కడి ప్రజానీకం జగన్ రెడ్డిని విశ్వసించకుండా చంద్రబాబు వెంటే నడవడం విశేషం.
అంగ, అర్ధ, అధికార బలమున్నా వైకాపాకు ప్రతికూల పవనాలు ఉధృతంగా వీచాయంటే జగన్ రెడ్డి పాలనపై ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉందో తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో తెదేపాకు 43.88%, వైకాపా 29.49%, పిడిఎఫ్ 18.59%, భాజపా 5.75% వచ్చాయి. 14.39% అధికంగా ఓట్లు టిడిపికి పడ్డాయి.
తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో తెదేపా 45.30%, వైకాపా 34.52%, పిడిఎఫ్ 15.30%, భాజపా కు 2.55% ఓట్లు వచ్చాయి. సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్న పశ్చిమ రాయల సీమ నియోజకవర్గంలో పులివెందుల వాసి భూమిరెడ్డి రామగోపాల రెడ్డి ఘన విజయం రాష్ట్రంలో వచ్చిన అనూహ్యమార్పుకు అద్దం పట్టింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా చావుతప్పి కన్నులొట్టబోయి అతికష్టం మీద బైటపడింది.. ఒకచోట 169 ఓట్లతో, మరోచోట 1043 ఓట్లతో గట్టెక్కింది.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి, సెక్యూరిటీ గార్డులను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా ఓటర్లుగా చేర్పించి, ఓటుకు రూ 5వేలు, సిల్వర్ కాయిన్స్ పంపిణీ చేసి ఉండకపోతే వీటిల్లో కూడా ఘోరంగా వైసీపీ ఓడిపోయేదే.
3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపు 10లక్షల కుటుంబాల్లో జనాభిప్రాయం ఇది.. 43.89%, 45.30%, 41.58% టిడిపి అభ్యర్ధులకొచ్చిన ఓట్ల శాతం కాగా వైసిపి అభ్యర్ధులకు వాటికన్నా 13-20% తక్కువ రావడం గమనార్హం. 2019 సాధారణ ఎన్నికల ఫలితాలతో, ఇప్పటి ఎమ్మెల్సీ ఫలితాలను పోలిస్తే, జనాభిప్రాయంలో మార్పు ఎలావుందో తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసిపి గ్రాఫ్ 18.89%కి పడిపోయింది. తూర్పుసీమలో 19.10%, పశ్చిమసీమలో 13.37% తగ్గిపోయింది. ఇంత భారీఎత్తున వైసిపి ఓట్ల శాతం తగ్గిపోవడం జగన్ రెడ్డి ప్రభుత్వ స్వయంకృతాపరాధాలే..
భాజపా అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకంటే, చెల్లని ఓట్లే ఎక్కువ ఉండటం ఆ పార్టీపై ఏపి ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనం. ఉత్తరాంధ్రలో మాధవ్ కు 11,270ఓట్లువస్తే చెల్లనిఓట్లు 12,795 ఉన్నాయి.
తూర్పు రాయలసీమలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి 6314ఓట్లు వస్తే చెల్లని ఓట్లు 20,979 కాగా, పశ్చిమ సీమలో భాజపా రాఘవేంద్రకు 7494వస్తే, చెల్లని ఓట్లు 19,108 ఉండటం విశేషం..బిజెపిని, వైసిపిని ఒకేగాటన కట్టారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. జనసేనతో పొత్తు పేరుకు మాత్రమేగా మారిందని, ఆ పొత్తుతో బిజెపికి ఒనగూడిందేమీ లేదని ఓటమిపాలైన సిటింగ్ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. గతంలో పవన్ కల్యాణ్ మాటలు, ఇప్పుడు మాధవ్ వ్యాఖ్యల సారాంశం కలిపిచూస్తే 2పార్టీల మధ్య ఎంత గ్యాప్ ఏర్పడిందో తెలుస్తోంది.. ప్రజా ఉద్యమాలపై ఢిల్లీలో రోడ్ మ్యాప్ ఇస్తామన్నారని, ఏపికి వచ్చాక ముఖం చాటేశారని పవన్ వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం..
కమలం ఓటర్ల రెండో ప్రాధాన్యం టిడిపి అభ్యర్ధులకే ఉండటం మరో కొసమెరుపు. వైసిపి చేర్పించిన దొంగ ఓట్లన్నీ చెల్లకుండా పోవడం ఇంకో విశేషం.. తూర్పు సీమలో దాదాపు 21వేల ఓట్లు, పశ్చిమ సీమలో 15వేలకు పైగా ఓట్లు చెల్లలేదు. 6వ తరగతి, 9వ తరగతి చదివినోళ్లను, తమిళనాడు నుంచి వాహనాల్లో రప్పించిన వాళ్లను, పట్టభద్రుల ఓటర్లుగా దొంగ ఓటర్ కార్డులు సృష్టించి పోలింగ్ కు పంపినా వైసిపికి ఫలితం దక్కలేదు..ఇదంతా చిన్న సెక్షన్ మాత్రమేనని, వీళ్లలో వైసిపి ప్రభుత్వ సంక్షేమం పొందిన వాళ్లు లేరని, టిడిపి ప్రలోభాలు పెట్టిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు నలుగురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్లుంది..
ఒకవైపు వైసిపి అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు అవినీతి కుంభకోణాలు, ఇంకోవైపు జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం, వరుస ఎన్నికల్లో టిడిపి స్వీప్ చేయడం చూసి ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో కలవరం రేగుతోంది.. మళ్లీ నిలబెడితే అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేల ఓటమి తప్పదంటూ సిఎం జగన్ కు ఇంటలిజెన్స్ నివేదికను అందజేసిందన్న వార్తలతో బేజారెత్తుతున్నారు. అంతర్గత విభేదాలు, కలహాలు వైసిపిలో పరాకాష్టకు చేరాయి..మొత్తం 175కు గాను, 135నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలతో మల్లగుల్లాలు పడ్తున్నారు. 52మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి.
35మంది సిట్టింగ్ లను స్థానిక కేడరే వద్దనడం గమనార్హం.. 42మందిని మళ్లీ నిలబెడితే ఓటమి తప్పదని, 12మంది ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం బొక్కుతున్నారని, 14మంది నియోజకవర్గాలను వదిలేసి సొంత వ్యాపారాలపైనే పూర్తి దృష్టి పెట్టారనేది ఇంటలిజెన్స్ నివేదిక సారాంశంగా తెలుస్తోంది.. ఏడాదిలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పతనమైంది..ఆయన గ్రాఫ్ 17.6% పడిపోయిందని, ప్రజల్లో ఆదరణ 56.5%నుంచి 39.7%కు దిగజారిందని, ఏడాదిలోనే భారీగా పతనమైందని ‘‘సీ ఓటర్ ఇండియా టుడే’’ సర్వే వెల్లడించిందనే వార్తలు ఆ పార్టీలో ముసలానికి మూలకారణం. స్వరాష్ట్రాల్లో సీఎంలకు ప్రజాదరణలో 10వ స్థానంలోకి జగన్ దిగజారారని, నవీన్ పట్నాయక్ (73.2%), అరవింద్ కేజ్రీవాల్ (69.2%), హిమంత బిశ్వశర్మ (68.%)తో మొదటి 3స్థానాల్లో ఉన్నారనేది దాని సారాంశం.
ఏపిలో మంత్రులు, మాజీ మంత్రుల 38నియోజకవర్గాల్లో 7గురే గెలుస్తారని ఐ ప్యాక్ సర్వే వైసిపిలో కలవరాన్ని మరింత పెంచింది.
ఉత్తరాంధ్ర వైసిపి నేతల మధ్య వర్గపోరు శ్రుతిమించింది. విజయనగరంలో బొత్స కుటుంబంలో తీవ్ర మనస్ఫర్ధలపై ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు తమకొద్దని పలాస పార్టీ నేతలే అధిష్టానానికి తెగేసి చెప్పారు. పాడేరు వైసిపిలో 5వర్గాల మధ్య సిగపట్లు తెలిసిందే. ఇక విశాఖలోనైతే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్ సభ సభ్యుడు ఎంవివి సత్యనారాయణల మధ్య విభేదాలు పరాకాష్టకు చేరాయి. అనకాపల్లిలో మంత్రి అమరనాథ్ పై వైసిపిలోనే కుంపటి రగులుతోంది. పాడేరులో ఎంపి మాధవికి, ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గడపగడపకూ వెళ్లాలంటేనే వైసిపి ఎమ్మెల్యేలు భీతిల్లే పరిస్థితి నెలకొంది.
రోడ్లకు అడ్డంగా చెప్పుల దండలు కట్టడం( భీమిలి మండలం కె నగర పాలెంలో, మాజీ మంత్రి ముత్తంశెట్టికి నిరసన), ‘‘నాలుగేళ్ల తర్వాత గుర్తొచ్చామా’’ అని ఎమ్మెల్యేలను ప్రజలే నిలదీయడం, పింఛన్లపై ధ్వజమెత్తడం, వైసిపిపై నెలకొన్న వ్యతిరేకతకు కొన్ని నిదర్శనాలు మాత్రమే… రాజధాని ఆశచూపి, అమరావతిపై ద్వేషం పెంచి ఉత్తరాంధ్రలో పాగా వేయాలన్న జగన్ రెడ్డి కుతంత్రం బూమ్ రాంగ్ అయ్యింది.
ఉత్తరాంధ్ర 3జిల్లాల్లోని రైతాంగం వైసిపి ప్రభుత్వం అంటేనే మండిపడుతోంది. యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనకుంటే కష్టమని, పంట చేతికొచ్చి నెల దాటినా ధాన్యం కొనకపోతే అన్నదాతల కన్నీటి ఉసురు తమకు తగుల్తుందని, రైతులు పెట్రోలు డబ్బాలు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారంటూ సీఎం జగన్ తో మంత్రులు ధర్మాన, బొత్స, రాజన్నదొర వాపోవడం స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు నిదర్శనం.
రాబోయే ఎన్నికల్లో వైసిపి పై రైతుల వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది వైసిపి నేతలే ఒప్పుకున్న వాస్తవం. గత 4ఏళ్లలో ఈ ప్రాంతంలో భూకబ్జాలు, ఆక్రమణలు పేట్రేగిపోవడం, ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో రౌడీమూకలు, గుండా గ్యాంగుల స్వైర విహారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలున్నాయి. ఇక ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని మార్పు అంశం వైసిపికి సజీవ సమాధి కానుంది. అమరావతిలో అభివృద్ధి పనులు నిలిపేయడం, టిడిపి ప్రభుత్వం వేసిన రోడ్లను కూడా తవ్వేసి, కంకర, మెటల్ వైసిపి వాళ్లే స్వాహా చేయడం, కట్టిన భవనాలన్నీ పాడుబెట్టడం ప్రజాగ్రహానికి ఆజ్యం పోసింది.
జగన్ రెడ్డి సీఎం కాగానే బెజవాడను మళ్లీ రౌడీవాడ చేశారు. ఎటుచూసినా బ్లేడ్ బ్యాచ్ లు, గంజాయి బ్యాచ్ ల దాడులు, దౌర్జన్యాలే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైకి వందలాది రౌడీలతో జోగి రమేశ్ గ్యాంగ్ దాడికెళ్లడం, మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయంపై దేవినేని అవినాశ్ రౌడీమూకల విధ్వంసకాండ, సిబ్బంది తలలు పగులకొట్డడం మర్చిపోకముందే వల్లభనేని వంశీ గుండాల గ్యాంగ్ గన్నవరం టిడిపి కార్యాలయాన్ని తగులపెట్టడం, వాహనాల దగ్దం, స్థానిక బిసి నేత దొంతు చిన్నా ఇంటిని ధ్వంసం చేయడం, చెన్నుపాటి గాంధీ కన్ను పోగొట్టడం, పట్టాభిపై దాడులు, ఆయన ఇంట్లో విధ్వంసకాండ, జిల్లాలో హత్యలు, అశాంతి- అభద్రతపై ఉమ్మడి కృష్ణాజిల్లా జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి.
క్యాసినోలు, పేకాట నిర్వహణే వైసిపి నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందనే భావన సర్వత్రా నెలకొంది..హోటళ్లు, ఛోటామోటా నేతల ఇళ్లు, శివారు తోటలు, ఫామ్ హవుస్ లు వైసిపి గ్యాంబ్లింగ్ డెన్ లుగా మారాయి. గుంటూరులో టిడిపి సానుభూతిపరులను పొలాలు సాగుచేసుకోనివ్వకుండా గ్రామాలనుంచి బహిష్కరించడం, తోటలు నరికేయడం, గృహదహనాలకు పాల్పడటం, వైసిపి బాధితుల పునరావాస శిబిరాన్ని టిడిపి నిర్వహించడం, వైసీపీ మంత్రుల అవినీతి కుంభకోణాలు, మంత్రి అంబటి రాంబాబు ‘‘గంట, అరగంటా..’’ఫోన్ కాల్స్, సత్తెనపల్లిలో గత 3ఏళ్లుగా లాటరీ పేరుతో కోట్లు కొల్లగొట్టడం, సీఎం పరిహారంలో కూడా వాటాలడగడం ప్రజల్లో ఆ పార్టీపై అసహ్యాన్ని పెంచాయి.
మాచర్ల మరో ఛంబల్ లోయగా మార్చడం.. స్థానిక సంస్థల ఎన్నికలకెళ్లిన బొండా ఉమా, బుద్దా వెంకన్నల కారుపై ఇనుప రాడ్ తో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డ వైసీపీ నాయకుడిని ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ చేయడం, ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి పర్యటనలో హింసా విధ్వంస కాండ, టిడిపి కార్యాలయాన్ని తగులపెట్టడం, టిడిపి బిసి నాయకుల హత్య, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రజల్లో వైసిపి వ్యతిరేక జ్వాలలను పెంచింది. ప్రకాశం జిల్లా వైసిపిలో వైవి సుబ్బారెడ్డి, బాలినేని వర్గాలుగా విడిపోయాయి. పదేపదే ఈ రెండువర్గాల కీచులాటలతో విసిగివేసారిన జగన్ రెడ్డి చేసేదిలేక వైవి సుబ్బారెడ్డిని ఇక్కడనుంచి మళ్లీ విశాఖకు పంపడం జరిగింది.
ఇక చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి వర్గపోరునెలా సమసిపోయేలా చేయాలో తెలీక, ఆమంచి కృష్ణమోహన్ ని అద్దంకి పంపితే అక్కడా అవే సిగపట్లు..చీరాలలో ఆమంచి సోదరుడు స్వామి మరో వర్గం హల్ చల్ తో జగన్ కింకో బొప్పి కట్టింది. పరుచూరు, కొండెపి తదితర నియోజకవర్గాల్లోనూ వర్గపోరే వైసిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒంగోలు ఆర్యవైశ్యుడు సుబ్బారావు గుప్తాపై బాలినేని శ్రీనివాస రెడ్డి కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైశ్యులంతా వైసిపి అంటేనే మండిపడ్తున్నారు.
నెల్లూరు జిల్లాలో వైసిపి కంచుకోట పూర్తిగా బీటలు వారింది.
పార్టీ రివర్స్ గేర్ లో వెనక్కి పారిపోతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో ముసలానికి ప్రత్యక్ష సాక్ష్యం..80ఏళ్ల రాజకీయ చరిత్రవున్న ఆనం కుటుంబాన్ని ఈ విధంగా అవమానించడం, 10-20కోట్లకు అమ్ముడుపోయారని సజ్జల ఆరోపణలు నెల్లూరు పెద్దారెడ్లంతా కుపితులయ్యారు. జగన్ పార్టీ నిలబడటానికి డబ్బంతా వాడింది తామైతే సస్పెన్షన్ తమకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని మేకపాటి కుటుంబం వాపోవడం గమనార్హం.. . కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆనం రామనారాయణ రెడ్డికి భద్రత కుదించడం సీఎం సొంత సామాజిక వర్గంలోనే ఆగ్రహావేశాలను పెంచింది.
ప్రశ్నించిన వారికి భద్రత కుదించడం, ప్రతిపక్షంపై దాడిచేసిన వారికి భద్రత పెంచడమే జెపిసి(జగన్ పీనల్ కోడ్) చట్టం, జగన్ మార్క్ లా అండ్ ఆర్డర్.. రాయలసీమ జిల్లాల్లోనూ పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పే.. ఏ క్షణాన్నైనా అది కార్చిచ్చుగా మారి వైసిపినే దహించేలా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలపై, అక్రమ మైనింగ్, అవినీతి కుంభకోణాలపై జిల్లావాసుల్లోనే కాకుండా ఆపార్టీ నాయకుల్లోనూ చిచ్చు పెట్టింది.. అంతర్గత విభేదాల కుంపట్లు రావణకాష్టంలా మండుతున్నాయి. కాపు రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి, పెద్దారెడ్డి హింసా దౌర్జన్యాలు, కబ్జాలు, అవినీతి కుంభకోణాలతో జనం విసిగివేసారు. కడపలో గత ఎన్నికల్లో వైసిపి క్యాష్ చేసుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతమే ఈ ఎన్నికల్లో ఘోర ఓటమికి మూలకారణం కానుందనే సమాచారంతో జగన్మోహన్ రెడ్డి బేజారెత్తుతున్నారు.
వివేకా హత్య నిందితులను జగన్ రెడ్డే కాపాడుతున్నారని, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదనే భావన కడపవాసుల్లో ఉంది. వివేకా కుమార్తె సునీత చేస్తున్న న్యాయపోరాటనికి ప్రజల్లో పూర్తి మద్దతు నెలకొనడం వైసిపికి జీర్ణించుకోలేని అంశమే.. టిడిపి నుంచి ఎవరిని పోటీకి దింపినా జిల్లాలో అనేక స్థానాల్లో ఘన విజయం సాధిస్తారనే భావన ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపినుంచి బరిలోకి దిగిన పులివెందుల వాసి భూమిరెడ్డి రామగోపాల రెడ్డి అద్భుత విజయమే దీనికి నిదర్శనం.
ఏ రాయలసీమలోనైతే గత ఎన్నికల్లో వైసిపికి 90%సీట్లు దక్కాయో, ఇప్పుడీ మారిన పరిస్థితుల నేపథ్యంలో 10%సీట్లు వస్తే గొప్పనే భావన రాజకీయ విశ్లేషకులే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ స్థితిగతులను జగన్ రెడ్డి బేరీజు వేసుకోకుండా, మూర్ఖంగా వైనాట్ 175 అంటూ ముందుకెళ్తుండటం, కుప్పం మాదే అనడం నవ్వులపాలవుతోంది. ఇప్పుడున్న 151లో ఒక అంకె చెరిపేసుకోవాలని, 51రావడం చాలా కష్టమని, 15ఖాయం చేసుకోవచ్చనేది రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తం అవుతోన్న జనాభిప్రాయం.. మొత్తానికి తెలుగుదేశం పార్టీని మళ్లీ గద్దెనెక్కించిందాకా జగన్ రెడ్డి నిద్రపోయేట్లు లేడని బిజెపి, వామపక్షాల సానుభూతిపరుల ఉవాచగా ఉంది.