బలవంతంగా ఏపీలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా? వైసీపీ క్రిస్టియన్ పార్టీ అని ముద్ర పడింది కాబట్టి, టీడీపీకి హిందుత్వం అద్దే ప్రయత్నంలో ఉన్నారా? నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారా? లేదా, వైసీపీ వ్యూహంలో అనాలోచితంగా ఇరుక్కుని, చిక్కి బిక్కరిస్తున్నారా? అనే రకరకాల చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.
హిందుత్వ కార్డు ఉపయోగించి బీజేపీ కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకుంది. తెలంగాణలో కూడా అదే కార్డుతో విజయదుందుభి మోగిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో భగవద్గీతకు, బైబిల్ మధ్యే పోటీ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆల్రెడీ నిప్పు రాజేశారు. తిరుపతిలో బీజేపీ విసిరిన వ్యూహానికి, విరుగుడుగా చంద్రబాబు హిందుత్వను ఎత్తుకున్నారనేది ఒక వాదన! అయితే కేవలం తిరుపతి ఉపఎన్నిక కోసం టీడీపీ స్టాండు మార్చుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అంచనాలు కూడా సాగుతున్నాయి.
మతమార్పిడులు కొత్తేమీ కాదు…
దేశంలో, రాష్ట్రంలో మతమార్పిడులు కొత్తేమీ కాదు. అయితే రాజకీయ పార్టీల నేతలు అన్నీ మతాల ఓట్లపై ఆధారపడితే మాత్రం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక మతం ఓట్లు చాలనుకుంటే ఆ వ్యూహాలు వేరుగా ఉంటాయి. బీజేపీ విషయానికి వస్తే వారికి ముస్లింల ఓట్లు పడవు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్నారు. దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి బీజేపీ వేసిన వ్యూహం ఫలించింది. అదే ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ గెలుపు సాధ్యమే కాదు. ఇక ఏపీ విషయానికి వస్తే బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తేనెతుట్టెను గెలుక్కున్నట్టు భావించాల్సి వస్తోంది. ఇప్పటికే టీడీపీ క్రిస్టియన్లకు వ్యతిరేకమని అధికార వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్కి ఏ కొంచెం సందుదొరికినా టీడీపీ నాయకులు క్రిస్టియన్లకు దూరం చేసే ఫేక్ వార్తలను కూడా వైరల్ చేస్తున్నారనే మాట తెలుగుదేశం వర్గాలనుంచి వినిపిస్తోంది. దీని ద్వారా క్రిస్టియన్ల ఓట్లన్నీ వైసీపీ ఖాతాలో వేసుకునే వ్యూహంతో వారు ముందుకు వెళుతున్నారు.
మతం, కులం, వైసీపీ బలం
ఏపీలో రెడ్డి సామాజికవర్గంలో 90 శాతం మంది వైసీపీకే మద్దతు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడ్డి సామాజికవర్గానికి ఒక్క రూపాయి లబ్ది చేయకపోయినా, వారంతా వైసీపీ జెండాలు మోయడానికి సిద్దంగా ఉన్నారు. ఇక ఏపీలో 16 శాతం ఉన్న ఎస్సీలు, 7 శాతం ఉన్న ఎస్టీల్లో 90 శాతం మంది క్రిస్టియానిటీలో ఉన్నారు. వారందరికీ టీడీపీకి దూరం చేయడం అనే వ్యూహం ద్వారా టీడీపీ అధికారంలోకి రాకుండా చూడాలని అధికారపార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ ఉచ్చులో చంద్రబాబు పడితే ఇక బయటకు రావడం కష్టం. టీడీపీ మొదటి నుంచీ అన్నీ వర్గాలకు అండగా ఉంటూ వచ్చింది. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, బీసీలు ఇలా మతాలు కులాలకు పెద్దపీట వేసి ఆయా వర్గాల్లో అనేక మంది నేతలను తయారు చేసిన టీడీపీ ఉన్నట్టుండి ఒకేసారి హిందూ మతాన్ని పులుముకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలతో టీడీపీ క్రిస్టియన్లకు వ్యతిరేకం అనే విధంగా ముద్ర వేస్తున్నారు. దీన్ని ఛేదించే కార్యక్రమం టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టాలి. అంతేగాని హిందుత్వను ఎత్తుకుంటే తిరుపతి ఉపఎన్నికల్లో వచ్చే ప్రయోజనం కన్నా భవిష్యత్తులో టీడీపీకి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
చంద్రబాబు వ్యాఖ్యలతో రాజీనామాలు నిజమేనా
బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు రాజీనామా చేశారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇదంతా పేటీఎం బ్యాచ్ కుట్రే అనే తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో నిజం లేదని టీడీపీ క్రిష్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తికి టీడీపీతో సంబంధం లేదని, అతనికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ప్రవీణ్ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడని అతనితోపాటు 13 జిల్లాల అధ్యక్షులు కూడా రాజీనామా చేశారని పేటీఎం బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తాత్సారం జరుగుతోందనిపిస్తోంది.
చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ సైతం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వైఖరి అసహ్యం పుట్టిస్తోందని రాజీనామా అనంతరం ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకుని తిరిగిన చంద్రబాబు.. ఇప్పుడు క్రైస్తవులను అవమానిస్తున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇవన్నీ పార్టీకి ఇప్పటికిప్పుడు నష్టం చేయకపోయినా, చంద్రబాబు క్రిస్టియన్లకు వ్యతిరేకి అనే ముద్ర పడితే మాత్రం, అటు క్రిస్టియన్లు, ముస్లింలు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది.