ఆ నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ముసలం మొదలయ్యిందా ? ఆ జూనియర్ మంత్రి వివాదాస్పద తీరు సొంత పార్టీ నేతలకే రుచించడం లేదా ? తమకు గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న సీనియర్ లు ఎవరు ? సీనియర్ నేతలతో మంత్రికి ఉన్న గొడవలు ఏంటి ? సొంత పార్టీ పుట్టి ముంచెలా వ్యవహరిస్తున్న ఆ మంత్రి ఎవరు ?
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ గా చెప్పుకునే నియోజకవర్గాలలో అనకాపల్లి ఒకటి. కేవలం గ్రూపుల కోసమే రాజకీయాలు నడపడం ఇక్కడ స్పెషల్. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార వైసీపీకి గడ్డు పరిస్థితులు నాడుస్తున్నాయని టాక్. ముగ్గురు నేతలతో అక్కడ పార్టీ పరిస్థితి మూడుముక్కలాటగా తయారయ్యిందనే చర్చ వైసీపీ వర్గాలలోనే నెలకొంది.
అనకాపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరే పార్టీలో ముసలంకి కారణమనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమరనాథ్ ఒంటెద్దు పోకడలతో తాను తప్ప జిల్లాలో మరెవరూ కనిపించకూడదు అనేలా వ్యవహరిస్తున్నారట. మూడు కుటుంబాలకు అనకాపల్లితో అనుబంధం ఉన్నప్పటికీ , తనకే ప్రాధాన్యం లభించాలనే ధోరణితో అమరనాథ్ వ్యవహరిస్తున్నారట. ఈ క్రమంలోనే సీనియర్ లతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తన ప్రాభలయం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ వర్గాల్లో నెలకొన్న చర్చ.
ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్ర రావుతో అమరనాథ్ కు విబేధాలు ఉన్నాయి. అందుకే ఇటీవల జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్వహించిన అనకాపల్లి సభకు దాడి వీరభద్ర రావుకి ఆహ్వానం కూడా అందించలేదట.అయితే దీని వెనుక మంత్రి అమరనాథ్ హస్తం ఉందనేది దాడి వర్గీయుల్లో వినిపిస్తున్న టాక్.ఇక ఇదే అంశంపై దాడి సైతం బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి అమరనాథ్ కు వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతితోనూ అదే తరహా విబేధాలు ఉన్నాయట. తాజాగా అనకాపల్లి వేల్పుల వీధిలోని గౌరీపరమేశ్వరుల ఆలయ ప్రారంభోత్సవ వేడుకలో అమరనాథ్ చేసిన రచ్చతో ఈ విభేదాలు మరింత బహిర్గతమయ్యాయట.వాస్తవానికి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి గుడివాడ అమరనాథ్ తో పాటు , ఎంపీ సత్యవతిని కూడా ఆహ్వానించారు ఆలయ అధికారులు.అదేసమయంలో ఆహ్వాన కరపత్రాలు, పోస్టర్లపై ఇద్దరి ఫోటోలను ప్రచురించారు. అయితే ఈ పోస్టర్ లను చూసిన మంత్రి అమరనాథ్ అధికారుల తీరుపై రగిలిపోయారట.అసలు తన ఫోటోతో పాటు ఎంపీ ఫోటోను ముద్రించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక రాజకీయాల గురించి తెలిసి కూడా ఒకే విధమైన ప్రాధాన్యం ఇస్తారా అని ఆలయ నిర్వహాకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.అంతేకాకుండా ఫోటోను మారిస్తే కానీ కార్యక్రమానికి రానంటూ వారిపై వంటి కాలితో లేచారట. దీంతో నిర్వాహకులు పోస్టర్ పై ఎంపీ ఫోటో తొలగించి, కేవలం మంత్రి అమరనాథ్ ఫోటోను మాత్రమే ముద్రించి వాటిని మంత్రికి అందించారట.
అయితే మంత్రి అమరనాథ్ తీరుపై ఎంపీ వర్గం గుర్రుగా ఉందట. గుడి సాక్షిగా రాజకీయాలు చేయడంపై వారంతా మండిపడుతున్నారట.కాగా, పోస్టర్ లపై తన ఫోటో తొలగించడాన్ని అవమానంగా భావించిన ఎంపీ సత్యవతి ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయంచుకున్నారట.దీంతో వ్యక్తిగత పనులు మీద ఎంపీ అవుటాఫ్ స్టేషన్ వెళ్లారని కార్యాలయ వర్గాలతో చెప్పించారట.
నిజానికి కొంతకాలంగా అమర్నాథ్, సత్యవతిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతొందట.రేషన్ బియ్యం రగడ ఇద్దరి మధ్యన బాగా గ్యాప్ తీసుకొచ్చిందట. గతంలో ఎంపీ సత్యవతి ట్రస్టు కార్యాలయ భవనం వద్ద రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఉదంతం వెనక రాజకీయ కుట్ర ఉందని ఎంపీ వర్గం అనుమానిస్తోందట.ఈ నేపధ్యంలోనే అమర్నాథ్ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ సత్యవతి సీఎంకు ఫిర్యాదు చేశారట.
ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక విషయాల్లో ముగ్గురు నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. అదేసమయంలో అనకాపల్లిలో రాజకీయం మూడు ముక్కలాటగా మారగా, మంత్రి గుడివాడ అమరనాథ్ తీరు పార్టీ పుట్టి ముంచెలా తయారయ్యిందనే ఆవేదన వైసీపీ క్యాడర్ లో నెలకొందట.
మరి అనకాపల్లి వైసీపీ లో మొదలైన ముసలం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.