సీనియర్ ఐఏఎస్ అధికారిణి, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ బీజేపీని వీడి వైసీపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరున్న ఆమె తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయంగా లొలి ప్రయత్నంలోనే పరాజయం పొందారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె ఏపీ రాజకీయాలపై సైలెంట్ అయి పోయారు. తాజాగా రత్నప్రభ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు రత్నప్రభతో చర్చలు జరిపారని, ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి ఆమె సిద్దంగా లేరని, పార్లమెంట్కు పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగా వైసీపీలో చేరితే రాయలసీమలో ఓ లోక్సభ సీటు రత్నప్రభకు ఇచ్చేందుకు వైసీపీ ఓకే చెప్పనున్నట్లు సమాచారం.
జగన్ కేసుల్లో సీబీఐ విచారణ
కర్ణాటక కేడర్కు చెందిన రత్నప్రభ కుటుంబం మొత్తం సివిల్స్ అధికారులే. ఏపీలో వైఎస్సార్ హాయంలో ఐటి శాఖ కార్యదర్శిగా పని చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల సమయంలో క్విడ్ ప్రో కో కేసుల్లో రత్నప్రభ పైన సీబీఐ అభియోగాలు మోపగా విచారణ సైతం ఎదుర్కొన్నారు. తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరి అనేక తర్జన భర్జనల తరువాత తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్థానిక బీజేపీ నేతల సహకారం, జనసేన కేడర్ మద్దతు విషయంలో రత్నప్రభ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రచారం చేశారు. ఆ సమయంలో పవన్ రత్నప్రభను తన అక్కగా అభివర్ణించారు. రెండో సారి ప్రచారానికి వెల్లే సమయానికి పవన్ కరోనా బారిన పడ్డారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత రత్నప్రభ ఏపీ రాజకీయాల పైన ఎక్కడా స్పందించలేదు.
చేరిన తర్వాతే..
పార్టీలో చేరిన తరువాతనే హామీలు ఇవ్వటం ఉంటుందని, ముందుగా షరతులతో పార్టీలో చేరటం సాధ్యం కాదని వైసీపీ నేతలు అంటున్నారు. రత్నప్రభ వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుండి ఒక లోక్సభ కేటాయించే అవకాశం ఉందని వైసీపీలోని కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉన్నత విద్యా వేత్తగా.. మేధావి వర్గానికి చెందిన మహిళగా రత్నప్రభకు గుర్తింపు ఉంది. ఆమె చేరిక పార్టీకి మేలు చేస్తుందనే అంచనాల్లో వైసీపీ నేతలున్నారు. ఈ ప్రచారంపై రత్నప్రభ స్పందనేమిటో వేచి చూడాలి.











