’పుట్టిన రోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది తెలిసేది కొందరికే..’ పాటను మనం ఎన్నోసార్లు విన్నాం. చాలామంది ఇలాంటి పుట్టిన రోజున కేకును కట్ చేసుకుని పండుగలా చేసుకుంటారు.. మరి కొందరు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. అలాంటి విప్లవాత్మక నిర్ణయాన్ని జబర్దస్ట్ అదిరే అభి తీసుకున్నాడు. ఈ సెప్టెంబరు 24న అతని పుట్టిన రోజు. ఈరోజు ఏంచేయాలో ముందే నిర్ణయించుకుని ఉదయానే వెళ్లి నేత్రదానం, అవయవదానం చేసి వచ్చారు. తాను ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవలసి వచ్చిందో కూడా అభి చెప్పాడు.
‘మనిషి జన్మ చాలా విలువైనది. అతని అవయవాలకు కూడా అంత విలువ ఉంది. మనిషి చనిపోతే అతని అవయవాలు మట్టిలో కలిసిపోకూడదు, మంటల్లో కలిపోకూడదు. మనం చనిపోయినా మరో మనిషికి జన్మనివ్వాలి. మనిషి జన్మకు సార్థకత ఉండాలి. మన అవయవాలను దానం చేస్తే మనం మరో మనిషికి ప్రాణం పోసినవారం అవుతాం. మరణించిన తర్వాత కూడా మేలుచేసినవారం అవుతాం. అందుకే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ఆ పనిచేసి వచ్చాను. మూఢనమ్మకాలను పక్కన పెట్టి అందరూ నేత్రదానం, అవయవదానం చెయ్యాలి’ అని అదిరే అభి అన్నారు. అదిరే అభి తీసుకున్న ఇలాంటి నిర్ణయం మరెందరికో స్ఫూర్తిదాయకం. అభి నిర్ణయం అదిరిందిలే అని అందరూ ప్రశంసిస్తున్నారు. అభికి లియో న్యూస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.