సీఎం కేసీఆర్కు వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ రాసిందంటూ ప్రస్తుతం ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ మీరు నా వేలు పట్టుకుని నడిపించారని, తాను సమావేశాలు జరిపింది నిజమేనని, తాను చేసింది తప్పేనని, తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ’ మంత్రిగా ఉన్నప్పుడు రాసినట్లుగా ఆ లేఖలో ఉంది. అయితే ఆ లేఖలో రాసిన తేదీ లేకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్కు ఈటల రాసిన లేఖను కావాలనే ఇప్పుడు ఎవరైనా లీక్ చేశారా లేక క్రియేట్ చేశారా అన్న అనుమానాలు కూడ ఉన్నాయి.
లేఖలో ఏముందంటే ..
‘ గత 20 ఏళ్లుగా టీఆర్ఎస్లో మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో కలిసి పనిచేయడంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకున్నాను. మీరు రాజకీయంగా అవకాశం ఇవ్వకుంటే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నాకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు’ అంటూ ఈటల కేసీఆర్ను కీర్తిస్తూ రాసినట్లుగా ఉంది. అంతేకాకుండా ‘ పార్టీకి ఇబ్బంది కలిగేలా సమావేశం పెట్టడం తప్పేనని, మీరు నా తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను’ అని ఈటల పేర్కొన్నట్లు ఆ లేఖలో ఉంది.
ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అంటూ..
అయితే మంత్రి వర్గం నుంచి భర్తరప్ చేసిన తర్వాత ఈటల కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్లోకి మంత్రులకు కూడ ఎంట్రీ లేదని, అది ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్లో జరిగేది కురుక్షేత్ర యుద్దమే అని అన్నారు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. హుజురాబాద్ ప్రజలంతా తనతోనే ఉన్నారన్న ధీమాతో ఈటల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు మంత్రులను, అనేక మంది నాయకులను కేసీఆర్ అక్కడ మొహరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్కు ఈటల రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Must Read ;- ఈటల,కేసీఆర్ ఇద్దరూ ఒకే గూటి పక్షులు.. మావోయిస్టుల లేఖ











