తిరుమల ఆలయంలో ప్రవేశించే సమయంలో క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి.. ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా? లేదా? అనే వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది.
ఈ వివాదాన్ని ఎంత పెద్దదిగా చేస్తే.. అంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ఇమేజిని దెబ్బ తీయవచ్చునని విపక్షాలు ఆరాటపడుతున్నాయి. అయితే.. ఇదే వివాదం ఇంకా ముదిరినా సరే.. మొత్తాన్నీ తనకు అనుకూలంగా తిప్పుకోగల, తన కీర్తిని, ప్రజాభిమానాన్ని ఇంతకు పదింతలు పెంచుకోగల అవకాశం జగన్ చేతిలోనే ఉంది.
గతంలో ఇతర మతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తిరుమల సందర్శించినప్పుడు.. అక్కడ డిక్లరేషన్ మీద సంతకాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సోనియా తిరుమల వచ్చిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెతో పాటు ఉన్నారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు.. ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద బోర్డు ఏర్పాటుచేశారు. ఇతర మతస్తులు, శ్రీవారి దర్శనానికి వెళ్లేముందు డిక్లరేషన్ మీద సంతకం చేయాలనేది అందులోని సారాంశం.
అయితే అప్పటిదాకా సోనియా వెంట ఉండి ఆమెతో పాటు నడుస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ బోర్డును గమనించి.. ఓ పది అడుగులు వడివడిగా ముందే నడుచుకుంటూ వెళ్లిన.. ఆ బోర్డు కనపడకుండా తీసి పక్కన పడేశారు. అధికారులు డిక్లరేషన్ ఫారం తేబోతే దాన్ని కూడా తోసేశారు. ఆ రకంగా సోనియా గానీ, రాజశేఖర రెడ్డి గానీ డిక్లరేషన్ లో సంతకాలు చేయకుండానే.. దర్శనం చేసుకున్నారు. వైఎస్సార్ తీరుపట్ల స్వల్ప విమర్శలు వచ్చాయి తప్ప.. ఇంత పెద్ద వివాదం కాలేదు.

అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల సందర్శించినప్పుడు.. మహద్వారం వద్ద టీటీడీ అధికారుల ఇస్తికపాల్ స్వాగతాన్ని అందుకుని.. లోనికి ప్రవేశించకుండా అక్కడే ఆగిపోయారు. డిక్లరేషన్ గురించి ఆయనే అధికారుల్ని అడిగి, అందులో సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారు. ఆరకంగా ఆలయ సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. అలా గౌరవించారు గనుకనే.. ఆయన ఉదాత్తత సౌశీల్యం గురించి ఇవాళ అంతా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి అవకాశం వచ్చింది.
ఇక్కడ చంద్రబాబునాయుడు వ్యవహార సరళి గురించి కూడా చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ప్రొటోకాల్ ప్రకారం మహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశంచి దర్శనం చేసుకోడానికి వెసులుబాటు ఉన్నప్పటికీ.. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు తప్ప.. ఆ ప్రొటోకాల్ మహద్వార దర్శన హోదాను ఎన్నడూ ఉపయోగించుకోలేదు. బ్రహ్మోత్సవాలు మినహా వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఏ ఇతర వీఐపీ మాదిరిగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండానే దర్శనానికి వెళ్లేవారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ఎన్నడూ డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఆయనను ఎవ్వరూ ప్రశ్నించను కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. పాదయాత్ర ముగిసినప్పుడు, ఇంకా పలు సందర్భాల్లో తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అప్పట్లో ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఎవ్వరూ పట్టించుకోనూ లేదు.
కానీ ఇప్పుడు సంతకం గురించి రాద్ధాంతం జరుగుతోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నమే కావచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ సంతకం చేయని జగన్, సీఎంగా వస్తున్నప్పుడు అడగడం ఏంటని ఆయన అభిమానులకు కోపం కూడా ఉండచ్చు. కానీ.. వివాదం రేగింది గనుక.. వారి డిమాండ్ ను గౌరవిస్తే ఏమౌతుంది.
జగన్ పరువు బజార్లో పెట్టిన కొడాలి నాని!
జగన్ కీర్తి అమాంతం పెరుగుతుంది.
నా సంతకం గురించి ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు.. ఇంతమంది నానా యాగీ చేస్తున్నప్పుడు.. నాకు అభ్యంతరం లేదు. నేను డిక్లరేషన్ మీద సంతకం చేస్తాను అని జగన్ ఒక్క మాట ప్రకటిస్తే చాలు.. నిజానికి వారి రాద్ధాంతాన్ని పట్టించుకున్నట్టుగా ఆయన ప్రకటన చేయక్కర్లేదు. నేరుగా తిరుమలకు వచ్చిన రోజున తానే డిక్లరేషన్ బుక్ తెప్పించుకుని అందులో సంతకం చేస్తే చాలు.. ఆయన కీర్తి అమాతం పెరిగిపోతుంది.
ఇన్నాళ్లూ ఆయన చుట్టూ విమర్శలు అల్లుతున్న వాళ్ల నోర్లన్నీ మూత పడతాయి. సంతకం చేయకపోవడం వల్ల ఏమైనా డేమేజీ ఉంటుందా అని గుంజాటనలో ఉండే ఆయన ఫ్యాన్స్ మొత్తం ఎంతో హేపీ ఫీలవుతారు. జగన్ ఎందుకింత పట్టుపడుతున్నాడో.. అని భావించే తటస్థులందరూ ఆయన ఉదాత్తతను మెచ్చుకుంటారు.
తాను బుద్ధి పూర్వకంగా ఒక ఆలయంలో ఉండే (అది ఏమతానికి చెందినది అయినా సరే) నిబంధనను అతిక్రమించనని జగన్ ఒక స్పష్టమైన సంకేతం ప్రజలకు పంపినట్లు అవుతుంది. ఇలాంటి చర్య వల్ల ఆయన వ్యక్తిత్వం కూడా ఇనుమడిస్తుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
.. సురేష్ పిళ్లె











