నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకు ఏమైంది? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు?.. ఇది ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న. మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందెళనకరంగా ఉంది.
అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆ మధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన కొద్ది రోజుల క్రితం బాత్ రూమ్ లో కాలు జారి పడటంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయి వచ్చారు. శుక్రవారం రాత్రి 2 గంటలకు ఆయనకు శ్వాస అందక ఇబ్బంది పడటంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమవారు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
‘సిపాయికూతురు’ సినిమాతో..
1959 లో ‘సిపాయి కూతురు’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా ఏ పాత్రలో నటించినా అందులో ఒదిగిపోతారు. అందుకే ఆయనను నవరస నటనా సార్వభౌముడు అంటుంటారు. ఎస్పీ రంగారావు తర్వాత ఆ స్థాయి పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఒకే ఒక నటుడు సత్యనారాయణ. తన 60 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 800 చిత్రాల్లో నటించారు. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలను ఇంకెవరూ పోషించలేదు. విలనిజానికి ఓ ప్రత్యేకత తెచ్చిన నటుడు అని కూడా చెప్పవచ్చు.
మహిళలు కూడా తిట్టుకునేలా ఆయన పోషించిన పాత్రలు ఉండేవి. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపదం, కామెడీ విలన్, కరుడు కట్టిన విలన్, మంచి తాతయ్య.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘రాముడు భీముడు’ చిత్రంలో ఎన్టీఆర్ కు డూప్ గానూ నటించారు. ఆయన శరీర నిర్మాణం ఎన్టీఆర్ లా ఉండటంతో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చినప్పుడు కైకాలనే సంప్రదించేవారు. పైగా ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉండేది. ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల్లో కైకాల కూడా తప్పనిసరిగా ఉండేవారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం ఆయన సొంతూరు. 1935 జూలై 25న పుట్టారు. సినిమా రంగంలో వేషాల కోసం చెన్నైలో అనేక కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదిగారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. రమా ఫిలింస్ బ్యానర్ ను స్థాపించి అనేక చిత్రాలను కూడా నిర్మించారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు దేశం పార్టీలో చేరి మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగానూ గెలుపొందారు. అనేక అవార్డులు, రివార్డులు కూడా ఆయన సొంతమయ్యాయి.