నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును బ్రాహ్మణి గెలుచుకున్నారు. ఇండియాలో సక్సెస్ఫుల్గా బిజినెస్ నడిపిస్తున్న మహిళలకు ఈ అవార్డును అందజేస్తారు.భారతీయ వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నారా బ్రాహ్మణి నిలిచారు. ఈ అవార్డుతో నారా బ్రాహ్మణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
ఈ సందర్బంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచిపోయే సంస్థలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుతమైన విలువను సృష్టించడమని చెప్పారు తద్వారా ప్రజలను శక్తివంతం చేయడం. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు బిజినెస్ టుడేకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు, సోషల్మీడియాలో బ్రాహ్మణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మంత్రి నారా లోకేష్ సైతం భర్తగా బ్రాహ్మణి విజయం పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. బ్రాహ్మణి నిదానంగా బలమైన పునాదులు వేస్తూ సంస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. మాటల కంటే తను చేసే పనే ఎక్కువగా మాట్లాడుతుందంటూ ప్రశంలు కురిపించారు లోకేష్. ఈ అవార్డుకు నారా బ్రాహ్మణికి పూర్తిగా అర్హురాలంటూ ట్వీట్ చేశారు.
2011లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ బాధ్యతలు స్వీకరించారు బ్రాహ్మణి. తర్వాత, హెరిటేజ్ సంస్థలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఉత్పత్తిని పెంచడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, సంస్థ లాభాలను పెంచడంలోనూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు బ్రాహ్మణి ప్రాధాన్యత ఇచ్చారు.
2011లో వెయ్యి కోట్లుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయం నారా బ్రాహ్మణి కృషితో 2025లో రూ. 4,134 కోట్లకు చేరింది . హెరిటేజ్ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల మార్కెట్ 40 శాతానికి పెరిగింది. హెరిటేజ్ లో ఇప్పుడు పాలతో పాటు కర్డ్, పనీర్, ఐస్క్రీమ్, మిల్క్ డ్రింక్స్ మార్కెట్లో మంచి వాటా సాధించాయి. సంస్థను కేవలం సౌతిండియాకు మాత్రమే పరిమితం చేయకుండా..మహారాష్ట్ర, ఈస్టర్న్ రీజియన్కు సంస్థను విస్తరించారు.











