Kapu Quota Cancelled :
జగన్ జమానాలో మిడ్ నైట్ జీవోలు కలకలమే రేపుతున్నాయి. మీడియా గగ్గోలు చేయకుండా ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు.. కీలక నిర్ణయాలకు సంబంధించి అర్ధరాత్రి దాటిన తర్వాత జీవోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా నిర్ణయాలపై ఆ మరునాడు పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. ఆ తర్వాతి రోజు ఆ రచ్చే పతాక శీర్షికలకు ఎక్కి.. తాను తీసుకుంటున్న నిర్ణయం ఎక్కడో చిన్నగా రిపోర్ట్ అవుతుందన్న అంచనాతో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్ధరాత్రి జీవోల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ జాబితాలో ఇంకో జీవో కూడా చేరిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈబీసీ కోటాకు సంబంధించి జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈబీసీలకు కేంద్రం ప్రతిపాదించిన 10 శాతం రిజర్వేషన్లను మొత్తంగా ఆ వర్గానికే కేటాయిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకపై అంతా ఈబీసీకే..
ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈబీసీకి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం ప్రతిపాదిస్తే.. అందులో 5 శాతాన్ని కాపులకు కేటాయించిన చంద్రబాబు సర్కారు.. మిగిలిన 5 శాతాన్ని ఈబీసీకి కేటాయించింది. ఈ నిర్ణయంతో ఇటు ఈబీసీలతో పాటు ఎన్నాళ్లుగానో రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న కాపులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. గడచిన ఎన్నికల్లో గెలిచిన వైసీపీ… అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల దాకా ఈ రిజర్వేషన్లను ఇలాగే అమలు చేసింది. అయితే ఎందుకో తెలియదు గానీ.. కాపులకు కొనసాగుతున్న రిజర్వేషన్లను ఎత్తేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అనుకున్నదే తడవుగా కాపుల కోటాను ఎత్తేసి.. మొత్తం 10 శాతం రిజర్వేషన్లను ఈబీసీలకు కేటాయిస్తూ బుధవారం రాత్రి సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో జగన్ కాపుల కడుపు కొట్టేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగాలకు కూడా..
ఇదిలా ఉంటే.. ఈబీసీ రిజర్వేషన్లను విద్యావకాశాలకే పరిమితం కాకుండా ఉద్యోగావకాశాల్లోకూ విస్తరిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అంటే.. ఇకపై ఈబీసీకి 10 శాతం మేర రిజర్వేషన్లు ఇటు విద్యలోనే కాకుండా అటు ఉద్యోగావకాశాల్లోనూ దక్కనున్నాయన్న మాట. అంతేకాకుండా ఈ రిజర్వేషన్లకు ఈబీసీ కుటుంబాల ఆదాయ పరిమితిని రూ.8లక్షల లోపున ఉండేలా కూడా జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఈబీసీ రిజర్వేషన్ల అమలు, వాటి అర్హతలపై జగన్ సర్కారు ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందన్న మాట. ఈబీసీ రిజర్వేషన్లను విద్యావకాశాలతో పాటు ఉద్యోగావకాశాలకు వర్తింపజేయడం మంచిదే గానీ.. కాపుల కోటాను ఎత్తేస్తూ.. వారినీ ఈబీసీ కోటాలోకే నెట్టేయడం ద్వారా జగన్ నిర్ణయంపై కాపుల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Kapu Quota Cancelled :
రఘురామ తక్షణ స్పందన..
ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు అర్ధరాత్రి విడుదల చేసిన ఈబీసీ రిజర్వేషన్లపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తక్షణమే స్పందించారు. కాపులకు కొనసాగుతున్న 5 శాతం రిజర్వేషన్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం ఉదయమే సీఎం జగన్ కు లేఖ రాశారు. అగ్ర వర్ణ పేదల్లో కాపులే 50 శాతం మేర ఉంటారని, ఈ నేపథ్యంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేసినా ఈబీసీలోని ఇతర కేటగిరీలకు చెందిన వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తక్షణమే కాపులకు న్యాయం చేసేలాఈబీసీ రిజర్వేషన్లపై జారీ చేసిన జీవోను రద్దు చేసి.. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని రఘురామ కోరారు.
Must Read ;- జగన్ ను బుగ్గన అడ్డంగా ఇరికించేశారే