అసలే సీఎం కేసీఆర్ కూతురు. లేకలేక ఎమ్మెల్సీ బరిలోకి..! గెలుపు లాంఛనమేనని లోలోపల ధీమాగా ఉన్నా.. వార్ వన్సైడేనని వార్తలు వినిపిస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం.. ఏమాత్రం లైట్గా తీసుకోవడం లేదు. గెలవడం కాదు.. గెలుపంటే ఇలా ఉండాలనేటట్టుగా భారీ మెజారిటీతో కొత్త రికార్డు సృష్టించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే కవితకు కేబినెట్ బెర్త్ ఖరారని ప్రచారం జోరందుకోవడంతో ఈ ఎన్నికల్లో హడావిడి మరింత ఎక్కువైంది. ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీశ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తూ కేడర్ను పరుగులు పెట్టిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా..
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న తరుణంలో కవిత అనూహ్యంగా ఓటమి పాలవడంతో అలాంటి ఫలితం పునరావృతం కాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు పక్కా ప్లానింగ్తో పని చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపే నేతలే లక్ష్యంగా పావులు కదుపుతూ కార్పొరేటర్లను కారెక్కిస్తున్నారు. ఓటు వేసే 824 మంది ప్రజాప్రతినిధుల్లో దాదాపు 80 శాతం మంది గులాబీ పార్టీకి చెందినవారే అయినప్పటికీ అన్ని పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నేతలను పిలిచి మరీ కండువా కప్పేస్తున్నారు.
రెండు సార్లు వాయిదాపడి..
ఇక్కడి నుంచి గతంలో ఎన్నికైన భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ పడింది. వాస్తవానికి ఈ ఎన్నికలు ఏప్రిల్ 7న ఎన్నిక జరగాల్సి ఉండగా కరోనా తీవ్రత నేపథ్యంలో రెండు సార్లు (మొత్తం 105 రోజులు) వాయిదా వేశారు. కరోనా తీవ్రత తగ్గి.. పోలింగ్ తేదీ ఖరారైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఉప ఎన్నిక పోలింగ్ను అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అధికార టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ తరఫున లక్ష్మి నారాయణ పోటీలో ఉన్నారు.
గెలిచిన వెంటనే కేబినెట్లోకి..!
కవితను రాజ్యసభకు పంపిస్తారని తొలుత అంతా భావించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రజల మందుకొస్తారని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటించిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక.. ఇప్పుడు.. ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే కవితకు కేబినెట్లో చోటు ఖరారంటూ అప్పుడే ప్రచారం మొదలైంది. అతిత్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని.. ఆయన వద్ద ఉన్న మంత్రిత్వ శాఖలను కవితకు అప్పజెప్తారని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కవితను మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకునే అవకాశాలు అత్యల్పమని, వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందే ఆమెకు ఛాన్స్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఆమెను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించి.. అప్పుడు మంత్రిని చేస్తారని మరో వర్గం విశ్లేషిస్తోంది.