‘మిస్ ఇండియా’ టీ అమ్మడం ఏంటండీ బాబూ. ‘మహానటి’గా కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ స్టార్ గానూ ఈమె వెలిగిపోతోంది. అలాంటి కీర్తి సురేష్ ఛాయ్ అమ్ముతూ కనిపిస్తే వింతే కదా. నిజానికి ఇది సినిమా ప్రమోషన్ లో భాగమే సుమా. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె కొత్త అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆమె తాజా సినిమా ‘మిస్ ఇండియా’ రేపు ఓటీటీలో విడుదలవుతోంది.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తోంది. ఇంతకుముందు ‘పెంగ్విన్’ సినిమా ద్వారా ఓటీటీలోనే కనిపించింది. ఈ సినిమాతోనే ఓటీటీ స్టార్ గా పేరుతెచ్చుకుంది కూడా. సినిమాలో దమ్ము లేకపోయినా కీర్తి బొమ్మ ద్వారా అమెజాన్ కు బాగానే వర్కవుట్ అయ్యింది. అందుకే నెట్ ఫ్లిక్స్ కు కూడా కీర్తి మీద బాగా నమ్మకం కుదిరినట్టుంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు ఈ సినిమాని నిర్మించారు.
ఈ సినిమా కథేమిటంటే?
పేరు వినగానే ఇది అందాల పోటీకి సంబంధించిన కథ అని అందరూ అనుకుంటారు. ఓ యువతి జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఎలా ఎదిగిందన్నదే అసలు కథ. ఇతర దేశాల్లో కాఫీకి చాలా డిమాండ్. మన దేశం నుంచి విదేశానికి వెళ్లిన ఓ అమ్మాయి టీ వ్యాపారం చేపడుతుంది. తను మంచి మంచి వ్యాపారవేత్తగా రాణించాలనేది ఆమె కల. అలా వ్యాపారం మొదలు పెట్టిన ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ఆమె ఎలా సక్సెస్ అయ్యిందన్నదే ఈ సినిమా. దర్శకుడిగా నరేంద్రనాథ్ కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు కూడా తగ్గించుకుని స్లిమ్ గా తయారైంది. ప్రస్తుతం సినిమాలో కీర్తి చాలా బిజీగా ఉంది.
ఓ పక్క ఇద్దరు సూపర్ స్టర్స్ రజనీకాంత్ ‘అణ్ణాత్తే’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో చేస్తోంది. అలాగే నితిన్ సినిమా ‘రంగ్ దే’లోనూ హీరోయిన్ గా నటించింది. ‘గుడ్ లక్ సఖి’ అనే మరో సినిమా కూడా చేసింది. మిస్ ఇండియా ప్రమోషన్ లో కీర్తి బిజీగా ఉంది. దీని కోసం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ ఛాట్ చేసింది. ఛాయ్ పే చర్చ అంటూ అభిమానులతో తన భావాలను పంచుకుంది. ఈ సందర్భంగానే ఈ సినిమా కథేంటి అనేది కూడా కొద్దిగా చెప్పేసింది. ‘ఛాయ్ ప్రేమి’ అంటూ నల్ల టీషర్టు వేసుకుని మరి ప్రచారం చేసింది. ఇది కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రం మాత్రమే. ఇందులో ఇంకో హీరోయిజానికి అవకాశం ఉండదు.. అంతా హీరోయినిజమే.