రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా థియేటర్స్ కి వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ మనసులను పట్టేసింది. వాళ్ల గుండె గోడలను నిచ్చెనలు లేకుండానే ఎక్కేసింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, భారీవసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఏ సెంటర్లో ఎవరిని అడిగినా ఈ సినిమా హిట్ అనే చెబుతున్నారు. ఒక సాధారణ ప్రేక్షకుడు ఆశించే ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ గా ఉండటంతో, ఈ సినిమాకి టికెట్స్ దొరకడమే కష్టమైపోతోందట!
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి ఫిల్మ్ నగర్లో ఒక టాక్ షికారు చేస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ముందుగా ఈ కథను వెంకటేశ్ కి వినిపించాడట. కథ బాగుందని చెప్పిన వెంకటేశ్ కొన్ని మార్పులు .. చేర్పులు సూచించాడని అంటున్నారు. అంతేకాకుండా ‘నారప్ప’కి సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉండటం వలన, కొంత ఆలస్యం కావొచ్చని చెప్పారట. దాంతో గోపీచంద్ మలినేని ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రవితేజకు వినిపించడం జరిగిందని చెప్పుకుంటున్నారు.
‘క్రాక్’ కథను నిజంగానే వెంకటేశ్ వినేసి, ఆ కథను వెయిటింగులో గనుక పెట్టి ఉంటే, ఏడాది ఆరంభంలోనే దక్కవలసిన ఒక హిట్ ను దూరం చేసుకున్నట్టే అవుతుంది. కానీ ఇందులో వాస్తవం ఉండకపోవచ్చుననే అనిపిస్తుంది. ఎందుకంటే ‘టైటిల్’ దగ్గర నుంచి ఏ అంశాన్ని తీసుకున్నా రవితేజను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఈ కథను రెడీ చేసినట్టుగా కనిపిస్తుంది .. అనిపిస్తుంది. అంతేకాదు రవితేజకు .. గోపీచంద్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ కథను ఆయన ముందుగా రవితేజకు వినిపించే అవకాశాలే ఎక్కువ. ఏదేవైనా ప్రతికూల పరిస్థితిల్లో .. ఏడాది ప్రారంభంలో రవితేజ హిట్ కొట్టాడు .. గోపీచంద్ మలినేనితో కలిసి హ్యాట్రిక్ హిట్ పట్టాడు.