ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాఫియాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఓ సంచలన విషయం ఇప్పుడు బయటపడింది. 25 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబుసలీం, ఆయన ప్రియురాలు మోనికా బేడీలకు కృష్ణమోహన్ రెడ్డి నకిలీ పాస్పోర్టు జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఐతే పాస్పోర్ట్ల జారీ కృష్ణమోహన్రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగింది. తప్పుడు చిరునామాలు, దొంగ పేర్లతో కృష్ణమోహన్ రెడ్డి అబుసలీం, మోనీకా బేడీలకు పాస్పోర్టులు ఇప్పించారు.
కృష్ణమోహన్ రెడ్డి చాలా మంది అనుకుంటున్నట్లుగా IAS కాదు. ఆయన ఎమ్మార్వో మాత్రమే. కర్నూలుజిల్లాలో MROగా పని చేస్తున్నప్పుడు అబూ సలీం, మోనికా బేడీలకు వేరే పేర్లతో పాస్ పోర్టులు రావడంలో కీలక పాత్ర పోషించారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్ పోర్టు వచ్చేలా చేశారు. అంతా ఆయనచేతుల మీదుగానే సాగింది. అదే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది. ఆ పోలీస్ వెరీఫికేషన్ కర్నూలు ఎస్పీకి నేతృత్వంలో సాగింది. ఆ SP ఎవరో కాదు..పీఎస్ఆర్ ఆంజనేయలే. అంటే ఉద్దేశపూర్వకంగానే తన అధికారాల్ని దుర్వినియోగం చేసి.. గ్యాంగ్ స్టర్ కు ఫేక్ పాస్ పోర్టు ఇప్పించి దేశం నుంచి పారిపోయేలా సహకరించారు. వీరికి నేరుగా అబూసలేంతో సంబంధాలు ఉన్నాయా..మోనికా బేడీతో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా మాఫియాలోని కీలక వ్యక్తుల కోసం సాయం చేశారా అన్నది తేలలేదు.
అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉండటం..జగన్ రెడ్డి హవా కొనసాగుతూడంటంతో ఈ కేసు తేలిపోయింది. దొంగ పాస్ పోర్టులు ఇప్పించిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి..సాక్షులుగా మార్చారు. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో దొరికిపోవడంతో పాత విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ మాఫియా లింకులేందో ఇప్పుడు సిట్ అధికారులు వెలుగులోకి తెస్తే చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
సనా మాలిక్ కమల్ పేరిట మోనికా బేడీకి 2001 ఏప్రిల్ 9న నివాస ధ్రువీకరణపత్రాన్ని ఆయనే జారీచేశారు. కర్నూలులోని బాబూ గౌండ వీధిలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకునే మోనికా బేడీ పాస్పోర్టు పొందగలిగారు. తన ప్రియుడు, 1993 నాటి ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక పాత్రధారి, దేశద్రోహానికి సంబంధించి పలు కేసుల్లో అభియోగాలున్న అబూ సలేంతో కలిసి 2002లో పోర్చుగల్కు పారిపోయి, అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత తీగ లాగితే కర్నూలు కేంద్రంగానే ఈ నకిలీ పాస్పోర్టుల తయారీకి బీజం పడినట్లు వెలుగుచూసింది. తొలుత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేయగా.. తర్వాత CBI రంగంలోకి దిగింది. కృష్ణమోహన్రెడ్డిని విచారించింది. నాటి ఆర్ఐ మహ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నివాస ధ్రువపత్రం జారీ చేశానంటూ కృష్ణమోహన్రెడ్డి ఆ కేసులో తప్పించుకుని సాక్షిగా మారారు. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లారు.
ఈ నకిలీ పాస్పోర్టు జారీ అయిన సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు. క్షేత్రస్థాయి తనిఖీ అధికారులిచ్చిన నివేదికల ఆధారంగా సనా మాలిక్ కమల్ పేరిట పాస్పోర్టు జారీకి అప్పట్లో ఆయనే నిరభ్యంతర పత్రమిచ్చారు. ఆంజనేయులు తర్వాత కర్నూలు ఎస్పీగా ఎన్.సంజయ్ వచ్చారు. ఆయన హయాంలో 2002 ఆగస్టులో ఈ నకిలీ పాస్పోర్టుల వ్యవహారం వెలుగుచూసింది. కేసులో కఠినంగా వ్యవహరించలేకపోయారని, కీలక నిందితులు విదేశాలకు పారిపోయినా గుర్తించలేకపోయారనే ఆరోపణలు, విమర్శలు సంజయ్పై ఉన్నాయి.
PSR ఆంజనేయులు ప్రస్తుతం ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో CID చీఫ్గా, అగ్నిమాపక శాఖ డీజీ హోదాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సంజయ్పై ACB కొన్నాళ్ల క్రితం కేసు పెట్టింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో కొనసాగుతున్నారు.











