ఏపీలో నిరుద్యోగిత నానాటికీ ప్రబలిపోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆశపెట్టి జగన్.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పారని.. ఫలితంగా నిరుద్యోగ యువతను బలి తీసుకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో లోకేశ్ ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో భావేద్వేగ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే
ట్వీట్ లో లోకేశ్ ఏమన్నారంటే.. **తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ మృతి తనను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోరాటం చేయాలని గోపాల్ తమ్ముడు శ్రీనివాసులు రాసిన లేఖ అందింది. మీ కుటుంబం పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే నేను చనుగొండ్ల గ్రామానికి వచ్చి మీ అమ్మానాన్నలను కలుస్తాను. మీ కుటుంబానికి కలిగిన శోకం రాష్ట్రంలో మరే కుటుంబానికి కలగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముందుండి పోరాటాన్ని నడిపిస్తాను. ఇచ్చిన హామీ మేరకు జగన్ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేంతవరకు నా పోరాటం ఆగదు” అంటూ లోకేశ్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
జగన్ పై లోకేశ్ రాజీ లేని పోరు
ప్రజా సమస్యలపై ప్రత్యేకించి యువత సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న లోకేశ్.. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని తనదైన శైలిలో పోరాటం సాగించిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు, నేతలపై వైసీపీ విరుచుకుపడుతున్న తీరుపైనా తనదైన శైలి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న లోకేశ్.. పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్న వైనం తెలిసిందే. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని పోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగుల సమస్యలపై, జాబ్ కేలండర్ పై జగన్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నారు. తాజాగా గోపాల్ ఆత్మహత్యతో లోకేశ్ చేసిన భావోద్వేగ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.